వాషింగ్టన్: మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న తీవ్రమైన ఘర్షణలను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ రిజెక్ట్ చేసింది. ఇరాన్ స్పందన తనకు ఏమాత్రం నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం (మే 10) తెలిపారు. ఇది కచ్చితంగా అమెరికాకు ఆమోదయోగ్యం కాదని  ఆయన పేర్కొన్నారు.

Continues below advertisement

ట్రంప్ కఠిన వైఖరిసోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో విడుదల చేసిన ఒక ప్రకటనలో ట్రంప్ పలు విషయాలు వెల్లడించారు. ఇరాన్ ప్రతినిధులు ఇచ్చిన సమాధానం తన అంచనాలకు అనుగుణంగా లేదన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ ప్రపంచ దేశాలతో పాటు అమెరికాను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా అమెరికాతో పాటు ప్రపంచంతో గేమ్స్ ఆడుతోంది.. వారు మా దేశాన్ని ఎగతాళి చేశారు, కానీ ఇకపై నవ్వలేరు’ అని ట్రంప్ రాసుకొచ్చారు. 

ఒబామాపై విమర్శలు"ఇరాన్ గత 47 ఏళ్లుగా అమెరికాతో, ప్రపంచంతో ఆటలాడుతోంది. బరాక్ ఒబామా అధ్యక్షుడు అయినప్పుడు ఇరాన్ జాక్‌పాట్ కొట్టింది. ఒబామా వారి పట్ల కేవలం మంచిగా ఉండటమే కాదు, అద్భుతంగా వ్యవహరించారు. వారి పక్షాన చేరి, ఇజ్రాయెల్, ఇతర మిత్రదేశాలన్నింటినీ వదిలేసి, ఇరాన్‌కు అత్యంత శక్తివంతమైన కొత్త జీవితాన్ని ఇచ్చారు. వందల బిలియన్ల డాలర్లు, 1.7 బిలియన్ డాలర్ల నగదును విమానాల్లో టెహ్రాన్‌కు వెండి పళ్ళెంలో పెట్టి అందించారు. డి.సి., వర్జీనియా, మేరీల్యాండ్‌లోని ప్రతి బ్యాంకును ఒబామా ఖాళీ చేశారు. ఆ డబ్బు ఎంత ఎక్కువగా ఉందంటే, అది అక్కడికి చేరుకున్నప్పుడు ఆ ఇరాన్ గూండాలకు దాంతో ఏం చేయాలో కూడా అర్థంకాలేదు. విమానం నుండి సూట్‌కేసులు, సంచులలో ఆ డబ్బును దింపినప్పుడు ఇరాన్ వాసులు తమ అదృష్టాన్ని తాము నమ్మలేకపోయారు. 

చివరకు వారు ఒక బలహీనమైన, తెలివితక్కువగా ఉన్న అమెరికా అధ్యక్షుడి రూపంలో అందరికంటే పెద్ద అమాయకుడిని కనుగొన్నారు. మన నేతగా ఆయన ఒక విపత్తు, కానీ జో బైడెన్ అంత అధ్వాన్నంగా మాత్రం కాదు. 47 ఏళ్లుగా ఇరాన్ వాసులు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ, మరోవైపు బాంబులతో మన ప్రజలను చంపుతున్నారు. నిరసనలను అణిచివేస్తూ ఇటీవల 42,000 మంది అమాయక, నిరాయుధ నిరసనకారుల ప్రాణాలు తీశారు. ఇప్పుడు మళ్ళీ గొప్పగా మారిన అమెరికాను చూసి ఇరాన్ నవ్వుతోంది. వారు ఇకపై నవ్వలేరు!’ అని డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

ఇరాన్ పెట్టిన కండీషన్లు ఇవేపాకిస్థాన్ మధ్యవర్తుల ద్వారా అమెరికాకు చేసిన ఈ ప్రతిపాదనలో ఇరాన్ పలు కీలక షరతులను ప్రతిపాదించింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్, ఇతర మీడియా నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్,  ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరుగుతున్న లెబనాన్ సహా అన్ని చోట్ల యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇరాన్‌పై ఉన్న ఆంక్షల నుండి ఉపశమనం కల్పించాలని కోరింది. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) విధించిన ఆంక్షలను కనీసం 30 రోజులు తొలగించాలని ఇరాన్ కోరింది. హర్మూజ్ జలసంధిపై ఉన్న ఆంక్షలను, అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.