Qaiser Ahmed Mir : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ ఉగ్రవాద కమాండర్ కైజర్ అహ్మద్ మీర్, అలియాస్ మొహమ్మద్ ఇక్బాల్ ఇస్లామాబాద్‌లో మరణించడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. సోర్స్ ప్రకారం, ఈ హిజ్బుల్ ఉగ్రవాది క్యాన్సర్‌తో మరణించాడు. భారతదేశం నుంచి పారిపోయిన తర్వాత అతను దాదాపు రెండు దశాబ్దాలుగా ఇస్లామాబాద్‌లోని తర్లై కలాన్ ప్రాంతంలో తలదాచుకుంటున్నాడు. 

Continues below advertisement

కాశ్మీర్‌లో కార్యకలాపాలు

1990 ఏప్రిల్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ఏర్పడినప్పుడు ఖైజర్ అహ్మద్ మీర్ దాని వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. 1990, 2008 మధ్య, అతను కాశ్మీర్ లోయలో యాక్టివ్‌గా ఉంటేవాడు. పుల్వామా, షోపియన్, రాజ్‌పోరాలో టాప్ హిజ్బుల్ కమాండర్‌గా ఎదిగాడు. అక్కడ జరిగిన దాడులు, కాశ్మీరీ పండితుల ఊచకోతలో కీలక పాత్ర పోషించాడని భద్రతా వర్గాలు అప్పట్లోనే తేల్చాయి. పాకిస్తాన్‌కు పారిపోయిన తర్వాత మీర్‌కు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, ఖైబర్ పఖ్తుంఖ్వా (KPK) ప్రావిన్స్‌లో ఉగ్రవాద శిక్షణ కార్యకలాపాలను పర్యవేక్షించే పని అప్పగించారు. 

మిలిటెంట్లకు శిక్షణ కేంద్రం

హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా బలమైన స్థావరమైన గర్హి హబీబుల్లాలోని గుల్ధేరి మొహల్లాలో ఉన్న ఖలీద్ బిన్ వలీద్ శిబిరంలో ఉగ్రవాద శిక్షణ బాధ్యతలు తీసుకున్నాడు. బుర్హాన్ వాని, రియాజ్ నైకూ, జాకీర్ ముసా వంటి ఉగ్రవాదులు ఇతని పర్యవేక్షణలో శిక్షణ పొందారు. పాకిస్తాన్‌ అతనికి ఇస్లామాబాద్‌లోని తర్లై కలాన్ ప్రాంతంలో ఉండేందుకు ఇల్లు ఇచ్చింది. నెలవారీగా దాదాపు 125,000 పాకిస్తానీ రూపాయల స్టైఫండ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

Continues below advertisement

OGW నెట్‌వర్క్ & లాజిస్టిక్స్

ఖైజర్ అహ్మద్ మీర్ ఇస్లామాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, అతను ప్రత్యేక శిక్షణ షెడ్యూల్‌ల టైంలోనే గర్హి హబీబుల్లాకు వెళ్లేవాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంతోపాటు చొరబాటుదారులకు కావాల్సిన వసతి, ఇతర విషయాల్లో సహాయడేందుకు జమ్ము కశ్మీర్‌లో విస్తృతమైన ఓవర్ గ్రౌండ్ వర్కర్ (OGW) నెట్‌వర్క్‌ మీర్‌ ఆధ్వర్యంలో పని చేసేది. 2019 పుల్వామా ఉగ్రవాద దాడి, బాలాకోట్ వైమానిక దాడుల తరువాత, అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ ఒత్తిడితో జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సి వచ్చింది. ఫలితంగా, ఖలీద్ బిన్ వాలిద్ శిబిరం మూసివేశారు.  

బాలాకోట్ దాడి తర్వాత శిక్షణకు అంతరాయం 

ఆ శిబిరం మూసివేతకు ముందు, హిజ్బుల్ ముజాహిదీన్ ఏటా 100 మందికిపైగా యువకులను ఉగ్రవాదులుగా శిక్షణ ఇచ్చేది. వీరిలో దాదాపు 40 శాతం మంది లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌లో చేరేవాళ్లు. శిబిరం మూసివేయడం వలన హిజ్బుల్ శిక్షణ పైప్‌లైన్ తీవ్రంగా దెబ్బతింది. రావల్పిండిలో హిజ్బుల్ కమాండర్ ఇంతియాజ్ ఆలంను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తరువాత పరిస్థితి మరింత దిగజారింది. ఇది పాకిస్తాన్‌లో ఆ గ్రూప్ ఆర్థిక నెట్‌వర్క్‌కు దెబ్బ తగిలింది. అదే సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు హిజ్బుల్‌ను చావుదెబ్బ కొట్టింది.  

ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీనియర్ హురియత్ నాయకుల అరెస్టుతో భారతీయ భద్రతా సంస్థలు పైచేయి సాధించాయి. వారి నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేశాయి. ఫలితంగా, హిజ్బుల్ ముజాహిదీన్ గతేడాది కాలంలో జమ్ముకశ్మీర్ నుంచి ఒక్క స్థానిక ఉగ్రవాదిని కూడా నియమించుకోలేకపోయింది. పుల్వామాకు చెందిన ఖైజర్ అహ్మద్ మీర్ మరణంతో, హిజ్బుల్ OGW నెట్‌వర్క్ బలహీనపడుతుందని భావిస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి ఈ సంస్థ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని లోయర్ దిర్, మన్సెహ్రా ప్రాంతాల్లో తిరిగి స్థిరపడటానికి ప్రయత్నిస్తోంది, కానీ లష్కరే తోయిబా, తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటోంది.

TTP తో ఘర్షణలు తీవ్రమవుతాయి

హిజ్బుల్ ముజాహిదీన్ జమ్ముకశ్మీర్ నుంచి ఉగ్రవాదులను నియమించడం, శిక్షణ ఇవ్వడం బాధ్యత వహించగా, లష్కరే తోయిబా పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి నియామకాలు చేపట్టేది. అయితే, హిజ్బుల్ భారత్‌ నుంచి నియామకాలు చేసుకోలేకపోయింది. పాకిస్తాన్ కేంద్రంగా నియామకాలు చేసుకునేందుకు లష్కరే తోయిబా అంగీకరించలేదు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య అంతర్గత పోటీ తీవ్రమైంది. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వాలో హిజ్బుల్ ముజాహిదీన్, టిటిపి మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆధ్వర్యంలో పని చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిజ్బుల్, నిఘా మార్గంగా పనిచేస్తుందని, ఆ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి టిటిపికి వ్యతిరేక కార్యకలాపాలలో పాకిస్తాన్ సైన్యానికి సహాయం చేస్తుందని వారి అనుమానం. అందుకే అక్కడ కూడా వారి పప్పులు ఉడకడం లేదు. ఇంతలో కీలకమైన కైజర్ అహ్మద్ మీర్ మరణం ఆ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బతో సమానంగా భావించవచ్చు.