Donald Trump :ప్రపంచ శాంతికి తోడ్పడినవారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది కాలం నుంచి తీవ్రంగా ఆశిస్తున్నారు. తాను ప్రపంచ శాంతి కోసం సాధించిన దౌత్య విజయాలే అందుకు నిదర్శనమని అవసరం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. "నోబెల్ వంటి బహుమతి స్వీకరించడానికి తనకు ఇంకేం కావాలి?" అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నోబెల్ కమిటీపైన ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కమిటీ ఉదారవాదుల పట్ల పక్షపాతం వహిస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే, ట్రంప్ తాను ఏం చేశారని నోబెల్ బహుమతిని ఆశిస్తున్నారో, ఆయన అభిప్రాయాలేంటో తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడిగా రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక డోనాల్డ్ ట్రంప్ తాను సాధించిన విజయాలను పదే పదే వల్లెవేస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం తాను తీవ్రంగా ప్రయత్నించానని చెప్పుకుంటున్నారు. తాను నోబెల్ బహుమతి రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని చెప్పుకునే కారణాలు ఇవే:
అబ్రహం అకార్డ్స్ (Abraham Accords) ఒప్పందం
ఈ అబ్రహాం అకార్డ్స్ అనే ఒప్పందం ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బహ్రెయిన్, సుడాన్, మొరాకో వంటి అరబ్ దేశాల మధ్య జరిగింది. దీనికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చొరవ చూపారు. ఈ ఒప్పందం వల్ల ఈ దేశాల మధ్య పూర్తి దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. 1994లో జోర్డాన్తో ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఒక అరబ్ దేశంతో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఒప్పందం సెప్టెంబర్ 15, 2020లో వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్లో ట్రంప్ సమక్షంలో జరిగింది. దీనికి యూదులకు, అరబ్బులకు తండ్రిగా భావించే అబ్రహాం పేరుతో అబ్రహాం అకార్డ్స్ అని పేరు పెట్టారు. ఇది మిడిల్ ఈస్ట్లో శాంతికి కీలకమైన ఒప్పందంగా ప్రచారం చేసుకుంటున్నారు.
ఉత్తర కొరియాతో చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం
ఉత్తర కొరియాలో పర్యటించిన ఏకైక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్; అంతకు ముందు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్లు మాజీ అధ్యక్షులుగా మాత్రమే పర్యటించారు. ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్తో ట్రంప్ శిఖరాగ్ర సమావేశం జరిపారు. కొరియా ద్వీపకల్పాన్ని అణు నిరాయుధీకరణ ప్రాంతంగా చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశాలు జరిగాయి. ఇలా మరో రెండు సార్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో సమావేశమైనా అనుకున్న ఫలితాలు మాత్రం సాధించలేదనే చెప్పాలి. అయితే, ఉత్తర కొరియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగుపెట్టడం, శాంతి ప్రయత్నాలు చేయడాన్ని గొప్పగా ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు.
భారత-పాకిస్థాన్ల మధ్య యుద్ధం నేనే ఆపా
2025 మే నెలలో ఇండియా-పాక్ల మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపింది తనేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో బాగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీన్ని భారత్ పలుసార్లు ఖండించింది. తన దౌత్యం వల్లనే, రెండు దేశాలకు వాణిజ్య ఒప్పందాల ఆశ చూపి యుద్ధాన్ని నివారించానని ట్రంప్ చెప్పుకోవడం ప్రారంభించారు. దీన్ని ప్రధాని మోదీ సహా భారతీయ దౌత్యవేత్తలు పలుసార్లు ఖండించడం జరిగింది. ఇండియా-పాక్ ద్వైపాక్షిక నిర్ణయం తప్ప మూడో దేశం జోక్యం తాము అంగీకరించేది లేదని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే, పాకిస్థాన్ మాత్రం డొనాల్డ్ ట్రంప్ను సమర్థిస్తోంది. నోబెల్ బహుమతి ఇస్తే తప్పేంటని కూడా ప్రశ్నిస్తోంది.
ఉదారవాదులకు తప్ప, సంప్రదాయవాదులకు ఇవ్వరా?
నోబెల్ శాంతి బహుమతి విషయంలో ట్రంప్ నోబెల్ కమిటీ తీరును తప్పుబడుతున్నారు. "తనకు శాంతి బహుమతిని ఎందుకు ఇవ్వరు?" అని ప్రశ్నలు సంధిస్తున్నారు. నోబెల్ కమిటీ సభ్యులు వామపక్ష, ఉదారవాదుల పట్ల సానుకూల ధోరణితో ఉంటున్నారని, తనలాంటి సంప్రదాయ, జాతీయవాదుల విషయంలో వ్యతిరేకంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా తనకు ఈ బహుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని మండిపడుతున్నారు. రాజకీయ కారణాల వల్లే తన విజయాలను గుర్తించడంలేదన్న ఆరోపణలు ట్రంప్ పదే పదే చేస్తున్నారు.
గతంలో నోబెల్ శాంతి బహుమతిని పొందిన రాజకీయ నేతలు ఎవరంటే..
శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల పరిరక్షణ కోసం పని చేసిన రాజకీయ నాయకులకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలాకు ఈ బహుమతి దక్కింది. అదే రీతిలో రష్యా అధ్యక్షుడిగా పని చేసిన మిఖాయెల్ గోర్బచెవ్కు ప్రచ్ఛన్న యుద్ధం ముగిసేలా చేసినందుకు, తూర్పు ఐరోపాలో ప్రజాస్వామ్యీకరణలో ఆయన కీలకంగా వ్యవహరించినందుకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అదే రీతిలో ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య శాంతి ఒప్పందాల కోసం పని చేసిన యాసర్ అరాఫత్, షిమెన్ పెరెజ్, ఇజ్జాక్ రాబిన్కు నోబెల్ బహుమతి దక్కింది. మయన్మార్లో మానవహక్కుల కోసం శాంతియుత పోరాటం చేసిన ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి దక్కింది. క్యాంప్ డేవిడ్ ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్-ఈజిప్టుల మధ్య శాంతి ఒప్పందానికి కృషి చేసిన అన్వర్ సదత్, మెనాచెమ్ బెగిన్కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అదే రీతిలో జర్మనీ మాజీ ఛాన్సలర్ విల్లీ బ్రాండట్ తూర్పు-పశ్చిమ జర్మనీల మధ్య సయోధ్య కోసం పని చేసినందుకు గాను నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
ఆ నలుగురి సరసన చేరాలన్నదే ట్రంప్ ఆకాంక్ష
అయితే, అమెరికా నుంచి నలుగురు వ్యక్తులకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అందులో 1906లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ రష్యా-జపాన్ యుద్ధం ముగించడం కోసం చేసిన కృషికి గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. ఆ తర్వాత 1919లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఉడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ శాంతి కోసం లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపించేందుకు చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆ తర్వాత 2002లో జిమ్మీ కార్టర్; ఈయన అమెరికా మాజీ అధ్యక్షుడు. అంతర్జాతీయ వివాదాలకు దశాబ్దాల పాటు శాంతియుత పరిష్కారాల కోసం చేసిన కృషిని గుర్తించి ఆయనకు నోబెల్ బహుమతి అందజేశారు. 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే బరాక్ ఒబామా అణు నిరాయుధీకరణకు, అంతర్జాతీయ దౌత్యంలో ఆయన పాత్రను గుర్తించి నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు. వీరితోపాటు 2007లో అమెరికా ఉపరాష్ట్రపతిగా పని చేసిన అల్ గోర్కు కూడా వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. వీరితో పాటు తాను చేసిన అంతర్జాతీయ దౌత్య ఒప్పందాలు, శాంతి స్థాపనకు చేసిన కృషిని గుర్తించాలన్నది ట్రంప్ వాదన. ఇప్పటికే ట్రంప్ రెండో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం మూడో దఫా అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు. ఈ దఫానే తాను నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది.