Donald Trump: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి ఎన్నికల సంస్కరణల అంశం వేడెక్కింది. గత కొంతకాలంగా అమెరికా ఓటింగ్ విధానంలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈసారి తన వాదనకు మద్దతుగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ను ఉదాహరణగా చూపారు. భారత ఎన్నికల వ్యవస్థలో ఉన్న పటిష్టత, ముఖ్యంగా ఓటర్ల గుర్తింపు కార్డు వినియోగంపై ఆయన ప్రశంసలు కురిపించారు.
తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అమెరికాలో ఓటు వేయడానికి కఠినమైన నిబంధనలు ఉండాలని, ముఖ్యంగా పౌరసత్వ ధ్రువీకరణ, ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో తనకు జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకున్నారు. భారత్లో సుమారు 64.6 కోట్ల మంది ఓట్లు ఉన్నారని, వారందరికీ చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ కార్డులు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
భారత్ను ఎందుకు ఉదాహరణగా చూపారు?
భారత ఎన్నికల నిర్వహణ తీరును అమెరికా నేర్చుకోవాలని ట్రంప్ సూచించారు. దీనికి ప్రధానంగా మూడు కారణాలను ఆయన విశ్లేషించారు. భారత్లో ఓటరు జాబితాలో పేరు ఉండటంతోపాటు పోలింగ్ కేంద్రం వద్ద ఫొటో ఐడీ కార్డు చూపించడం తప్పనిసరి. అమెరికాలో వివాదాస్పదంగా మారిన మెయిల్-ఇన్ బ్యాలెట్లపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. భారత్లో కేవలం 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మెయిల్ ద్వారా ఓటు వేస్తారని తెలిపారు. 2024 ఎన్నకల్లో 60 కోట్లకుపైగా ప్రజలు టు హక్కు వినియోగించుకున్నారని, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ అందరికీ ఐడీ కార్డులు ఉండటం అద్భుతమని కొనియాడారు.
ఈ చర్చ ఎందుకు మొదలైంది?
సేవ్ అమెరికా యాక్ట్ అనే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా రాయబారి సెర్గియోగోర్ కూడా ట్రంప్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఎక్స్లో పోస్టు చేశారు. భారత ఎన్నికల వ్యవస్థ గురించి ట్రంప్ చెప్పింది అక్షర సత్యమని పునరుద్ఘాటించారు.
ఎలాంటి మార్పులను ట్రంప్ కోరుతున్నారు?
సేవ్ అమెరికా యాక్ట్ ద్వారా అమెరికాలో ఎన్నికల సంస్కరణలకు తేనున్నారు. ప్రక్రియను మరింత కఠిన తరం చేయాలని చూస్తున్నారు. దీని ప్రకారం ఓటరుగా నమోదు చేసుకునే సమయంలోనే అమెరికా పౌరసత్వ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఓటు వేసే సమయంలో చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేయనున్నారు. ఓటు జాబితా నుంచి అనర్హులను, పౌరసత్వం లేని వ్యక్తులను గుర్తించి తక్షణమే తొలగించాలి. మెయిల్ ద్వారా ఓటింగ్ చేసే విధానంపై కఠినమైన పరిమితులు విధించాలి.
అమెరికాలో ఓటరు నమోదు ప్రక్రియ రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో గుర్తింపు కార్డు నిబంధనలు సరళంగా ఉండటంతో అక్రమ ఓటింగ్ జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. అయితే పౌరహక్కుల సంఘాలు, ట్రంప్ ప్రత్యర్థులు మాత్రం కఠిన నిబంధను విధిస్తే పేదలు, మైనారిటీలు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని వాదిస్తున్నారు.
