Imran Khan: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు స్వల్ప ఊరట లభించింది. తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలులో ఉన్న ఆయనను పంజాబ్‌ ప్రావిన్సులోని అటోక్‌ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని అధికారులను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్‌ కుటుంబ నేపథ్యం, హోదాను దృష్టిలో పెట్టుకుని అత్యంత భద్రత నడుమ, సకల సౌకర్యాలతో ఉండే రావల్పిండి జైలుకు తరలించాలని పీటీఐ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇమ్రాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైలుకు మార్చాలని,  అలాగే బీ-క్లాస్ వసతులు కల్పించాలని అధికారులను ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశించించినట్లు డాన్‌ పత్రిక వెల్లడించింది.


బి-క్లాస్ వసతులు అంటే ఏమిటి?
పాకిస్తాన్ ఆంగ్ల దినపత్రిక డాన్ కథనం ప్రకారం.. B-క్లాస్ కింద ఇమ్రాన్ ఖాన్‌కు పుస్తకాలు, వార్తాపత్రికలు అందుతాయి. టేబుల్, కుర్చీ, 21-అంగుళాల టెలివిజన్, ఒక పరుపు, దుస్తులు, జైలు ఆహారంతో పాటు  ప్రత్యేక బాత్రూమ్ సౌకర్యం కూడా ఉంది. అయితే బయట నుంచి ఆహారం పొందటానికి అవకాశం ఉండదు. అదేవిధంగా, శానిటరీ, వాషింగ్ సౌకర్యాలు ఉంటాయి. జైలులో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భంలో వెలుగు కోసం దీపం లేదా లైట్ పొందవచ్చు. 


మూడేళ్ల జైలు శిక్ష
ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఐదేళ్లపాటు అనర్హత వేటు పడింది. అంతేకాకుండా రూ.100,000 జరిమానా కూడా విధించింది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌కు ఉద్దేశపూర్వకంగా నకిలీ వివరాలను సమర్పించారని, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలడంతో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 174 ప్రకారం ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు ఆదేశాల అమలు కోసం ఇస్లామాబాద్ పోలీసు చీఫ్‌కు ఆర్డర్ కాపీని పంపాలని కూడా ADSJ దిలావర్ ఆదేశించారు.


తోషాఖానా అంటే ఏంటి?
ప్రభుత్వానికి వచ్చే కానుకలను భద్రపరిచే ఖజానాను తోషాఖానా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకు ఎవరు ఏ కానుక ఇచ్చినా తోషఖానాకు తప్పనిసరిగా అప్పగించాలి. 2018 నుంచి 2022 మధ్య కాలయంలో ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు రూ.140 మిలియన్ల విలువైన కానుకలను అందుకున్నారు. వాటిని ఖజానాకు జమ చేయకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకలేమిటో చెప్పడానికి నిరాకరించారు. పైగా వాటిని అమ్ముకోవడానికి అనుమతినివ్వాలంటూ ఈసీకి లేఖ కూడా రాశారు. 
2018, సెప్టెంబర్‌ 24 నాటికి అలా వచ్చిన కానుకల్లో 10 కోట్ల విలువైన కానుకలను ప్రభుత్వానికి 2 కోట్లు చెల్లించి ఇమ్రాన్‌ తీసుకున్నారని, వాటిని మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. వాటిలో వజ్రాల రిస్ట్‌ వాచీలు, ఉంగరాలు, కఫ్‌లింక్స్‌ పెయిర్, రోలాక్స్‌ వాచీలు, పెన్నులు పెర్‌ఫ్యూమ్స్, ఐ ఫోన్లు, మసీదు, అత్తర్‌ బాటిల్స్‌ నమూనాలు, కళాకృతులు అత్యంత ఖరీదైనవి కూడా ఉన్నాయి. కేవలం మూడు వాచీలను రూ.3.6 కోట్లకు అమ్ముకున్నట్లుగా తేలింది. 


పీఎంఎల్ విచారణ
పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌–నవాజ్‌ (పీఎంఎల్‌–ఎన్‌) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2022 ఆగస్టులో తోషాఖానా వివాదంపై కేసు నమోదు చేసింది. ఇమ్రాన్‌ తనకు వచ్చిన కానుకల వివరాలు చెప్పకుండా కొన్ని అక్రమ మార్గాల్లో అమ్ము కున్నారంటూ కేసు పెట్టింది. ఇమ్రాన్‌ గద్దె దిగిన తర్వాత తోషాఖానాలో కొన్ని పుస్తకాలు తప్ప మరే వస్తువు మిగల్లేదని పేర్కొంది. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి (ADSJ) హుమాయున్ దిలావర్ తీర్పు చెప్పారు.