Canada News: వరుస హింసాత్మక ఘటనలతో కెనడా అట్టుడుకుతోంది. నిత్యం తుపాకీ గుళ్ల చప్పుళ్లలతో వణికిపోతోంది. శుక్రవారం అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ అధికారులపై దుండుగుడు కాల్పలు జరిపాడు. ఇందులో ఒక పోలీస్ అధికారి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసు అధికారి శుక్రవారం వాంకోవర్ సబర్బ్‌లో ఓ నిందితుడికి అరెస్ట్ వారెంట్‌ను అందించడానికి వెళ్లగా వారిపై నిందితుడు కాల్పులకు తెగబడ్డాడు. వారిలో ఒకరు మరణించగా మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు.


బ్రిటిష్ కొలంబియాలోని ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ దీనిపై స్పందిస్తూ.. వాంకోవర్‌కు తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోక్విట్లామ్ పట్టణంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. నిందితుడికి 20 ఏళ్లు ఉంటాయని, కాల్పుల్లో అతనికి సైతం గాయాలు అయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ప్రాణాపాయం లేదని తెలిపింది. సర్రే RCMP డిప్యూటీ కమిషనర్ డ్వేన్ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ.. మరణించిన అధికారి కానిస్టేబుల్ రిక్ ఓ బ్రియన్ (51) అని కాల్పుల్లో అతను అక్కడికక్కడే మరణించినట్లు చెప్పారు.


ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని, ఒక అధికారి ఆసుపత్రిలో చికిత్స తర్వాత విడుదలయ్యారని, మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం లేదని  మెక్‌డొనాల్డ్ చెప్పారు. కోక్విట్లామ్‌లో జరిగిన కాల్పుల గురించి కార్లే హోడ్జెస్ అనే ప్రత్యక్ష సాక్షి వివరించారు. కాల్పులు జరిగిన సమయంలో ఒక అధికారిని అంబులెన్స్‌లో ఉంచి CPR అందించారని, మరో అధికారి కాలికి గాయమైందని, మరో వ్యక్తి చేతికి సంకెళ్లు వేసి తీసుకెళ్లారని చెప్పారు.


రిడ్జ్ మెడోస్ RCMP శుక్రవారం ఒక అధికారిని కోల్పోయిందని, బాధిత కుటుంబాలకు అలాగే స్థానిక అధికారులకు సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు పిట్ మెడోస్ నగరం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీస్ అధికారి మరణం, గాయాలపై ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేపట్టింది. 


సుఖా దునెకే హత్య
ఈ నెల 20న మరో ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్‌ అర్ష్ దల్లాకు రైట్ హ్యాండ్‌గా ఉన్న సుఖా దునెకే (Sukha Duneke) సెప్టెంబర్ 20న హత్యకు గురయ్యాడు. గత నెల సుఖా దునేకేతో సన్నిహితంగా ఉండే మన్‌ప్రీత్ సింగ్ పీటా, మన్‌దీప్ ఫిలిప్పైన్స్ నుంచి ఇండియాకి వచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే NIA ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో పంజాబ్ పోలీసులూ NIAకి సహకరించారు. పంజాబ్‌తో పాటు భారత్‌లో మరి కొన్ని చోట్ల అల్లర్లకు ప్లాన్ చేశారు. 


అర్స్ దల్లా వేసిన స్కెచ్ ఆధారంగా ఆందోళనలు చేపట్టాలని చూశారు. కానీ NIA ముందుగానే గ్రహించి అరెస్ట్ చేసింది. ఆ తరవాత గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) బంధువైన సచిన్‌నీ అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ గాయకుడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో అనుమానితుల లిస్ట్‌లో సచిన్ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. పంజాబ్‌లో Category A లిస్ట్‌లో ఉన్న సుఖా దునే హత్య మరోసారి కలకలం రేపుతోంది. 2017లో ఫేక్ పాస్‌పోర్ట్‌తో కెనడాకి వెళ్లాడు సుఖా. కెనడాలోని గ్యాంగ్‌స్టర్‌లందరితోనూ సుఖాకి సన్నిహిత సంబంధాలున్నాయి.