Bangladesh Plot Thickens Amid Mystery Over Sheikh Hasina Resignation :  బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాజ్యాంగపరంగా బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనానే ఉన్నారని ప్రచారం జరుగుతూండటమే. బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నప్పుడు .. ఉద్యమకారులు  ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టిన వెంటనే ఆమెను ఆర్మీ హెలికాఫ్టర్‌లో భారత్‌కు తరలించారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారని ప్రకటించారు. అధ్యక్షుడితో పాటు ఆర్మీ అధిపతి కూడా ఇదే ప్రకటన చేశారు. తర్వాత తాత్కాలిక ప్రభుత్వం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడింది. ఇప్పుడు రాజ్యాంగపరమైన ప్రక్రియ పూర్తి చేయడానికి హసీనా రాజీనామా పత్రం అవసరం వచ్చింది. 


రాజీనామా ప్రకటన చేసినా  అధ్యక్ష భవనానికి అందని రాజీనామా పత్రం               


దేశం నుంచి వెళ్లిపోతూ ప్రధాని పదవికి షేక్ హసీనా చేసిన రాజీనామా పత్రం ఎవరి వద్ద ఉందో అధ్యక్షుడు షహబుద్దీన్ ఆరా తీశారు. అయితే అది అధ్యక్షుడి కార్యాలయానికి చేరలేదని సిబ్బంది చెప్పారు. దీంతో ఆయన మిలటరీ అధినేతను అడిగారు. ఆయన కూడా తన వద్దకు  రాలేదని చెప్పారు. ఇలా  అవకాశం ఉన్న అందర్నీ కనుక్కున్నారు. కానీ అందరూ తమ వద్ద షేక్ హసీనా  రాజీనామా లేఖ లేదని ప్రకటించారు. ఇదే విషయాన్ని అధ్యక్షుడు షహబుద్దీన్ అధికారికంగా ప్రకటించారు. 


మోదీతో పెట్టుకున్న కెనడా ప్రధానికి పదవీ గండం- ట్రూడో రాజీనామాకి ఎంపీల డిమాండ్


ఆందోళనలు ప్రారంభించిన బంగ్లాదేశ్‌ విద్యార్థి సంఘాలు             


ఇదేదో కుట్రలాగా ఉందని మళ్లీ షేక్ హసీనాను ప్రధానిని చేయాలనుకుంటున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ ఆందోళనలు ప్రారంభించారు. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మాత్రం ఏం చేస్తారని  రాజీనామా లేఖ ఇచ్చేంత సమయం హసీనాకు లేక పోయి ఉండవచ్చని చెబుతున్నారు. అల్లర్లు జరుగుతున్న సమయంలో రాజీనామా ప్రకటన తర్వాత ఆమెను తరలించారు.కానీ రాజీనామా పత్రంపై సంతకం తీసుకోలేదు. 



Also Read: ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టంలో ఐరన్ డ్రోమ్ ఒక్కటేనా? ఇంకా ఉన్నాయా?




ఈ వ్యవహారంపై షేక్ హసీనా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాను రాజీనామా పత్రం మీద సంతకం పెట్టానని లేదా .. పెట్టలేదని ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతోంది .  పాలన వ్యవహారాలు చూడనప్పటికీ షేక్ హసీనానే ప్రధానమంత్రి అని అంటున్నారు. అయితే... షేక్ హసీనా దేశం నుంచి  పారిపోయినప్పుడే అధ్యక్షుడు ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆమె రాజీనామాతో సంబంధం లేదని అనే వాళ్లు కూడా ఉన్నారు. షేక్ హసీనా ప్రస్తుతానికి భారత్‌లో గుర్తు తెలియని ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్నారు.