Woman Saree Stuck in Metro:



మెట్రో ప్రమాదం..


మెట్రో ట్రైన్ డోర్‌లో చీర ఇరుక్కుపోయి ఓ మహిళ ప్రమాదానికి గురైంది. ప్లాట్‌ఫామ్‌పై కింద పడిపోయింది. కొంత దూరం వరకూ ఆ ట్రైన్‌ ఆమెను లాక్కెళ్లడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీలోని ఇందర్‌లోక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణాలతో పోరాడిన బాధితురాలు చివరకు మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే తీవ్ర రక్తస్రావమవడం వల్ల అది సాధ్యం కాలేదు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...బాధితురాలు రీనా డిసెంబర్ 14న మెట్రో ఎక్కేందుకు ఇందర్‌లోక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద రైల్ దిగుతోంది. ఆ సమయంలోనే మెట్రో డోర్‌లో చీర ఇరుక్కుపోయింది. ఆమె గమనించకుండానే దిగిపోయింది. ట్రైన్‌ అప్పటికే ముందుకి కదిలింది. ఒక్కసారిగా వెనక్కి లాగినట్టైంది. ప్లాట్‌ఫామ్‌పైనే ఆమె పడిపోయింది. బాధితురాలి భర్త ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. ఈ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. 


"ఇందర్‌లోక్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. నిజానికి ఆ మహిళ ట్రైన్ ఎక్కుతోందా, దిగుతోందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. మెట్రో డోర్‌లో చీర ఇరుక్కుపోవడం వల్లే ప్రమాదం సంభవించింది. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం...ఆమె ఓ మెట్రో దిగి మరో మెట్రో ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. హాస్పిటల్‌లో చేర్చే సమయానికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డిసెంబర్ 16న సాయంత్రం మృతి చెందింది."


- పోలీసులు