Independence Day 2024 : భారతదేశం ఆగష్టు 15, 1947న బ్రిటిష్ బానిసత్వం నుండి స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్యం జరుపుకుంటారు. భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని గురువారం, ఆగస్టు 15, 2024న జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. దాదాపు 200ఏళ్ల బ్రిటీష్ పాలన నుండి భారతదేశం విముక్తి పొందినందుకు గుర్తుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15న జరిగిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ వేడుక జరుపుకుంటారు. స్వాతంత్య్ర సమరయోధులు,  నాయకుల త్యాగాలను స్మరించుకుంటారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా, ఆసేతు హిమాచలం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. అయితే భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఇతివృత్తం, ప్రాముఖ్యత, చరిత్రను తెలుసుకుందాం.


మన్మోహన్ రికార్డు బద్దలు
 ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఎర్రకోట ప్రాకారంపై ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. వచ్చే 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి ఎర్రకోట నుంచి జెండాను ఎగురవేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే ఎక్కువ సార్లు జెండా ఎగురవేసిన ప్రధానిగా నిలువనున్నారు.  అయితే, అత్యధిక సార్లు జెండాను ఎగురవేసిన రికార్డు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ( 17 సార్లు ) పేరిట ఉంది. అసలు ఎర్రకోట పైనే జెండా ఎందుకు ఎగరవేస్తారో తెలుసా ? 


ఎర్రకోట చరిత్ర
 ఆధునిక భారతదేశ చరిత్రకు ఈ ఎర్రకోటతో విడదీయరాని అనుబంధం ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటుగా మొదలైన అలజడి మహా సంగ్రామంగా మారింది. మీరట్‌లో తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు, అక్కడి సిపాయిలు ఆఘమేఘాలపై ఢిల్లీకి వెళ్లి ఈ ఎర్రకోటలో బహదూర్ షా-2ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఆయన నాయకత్వంలో యోధులంతా ఒక్కటిగా నడిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని ముగ్గురు వీరులు, గురుభక్ష్ సింగ్ ధిల్లాన్, ప్రేమ్ కుమార్ సెహగల్,  సయ్యద్ షానవాజ్ ఖాన్‌లపై దేశద్రోహం ఆరోపణలు మోపి.. కోటలో సైనిక విచారణ జరిపింది. స్వాతంత్ర్య పోరాటాన్ని క్లైమాక్స్‌కు చేర్చిన మరచిపోని ఘట్టాలివి.


ఎర్రకోట స్వాధీనం చేసుకున్న బ్రిటన్
1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత.. బ్రిటన్ ఈ కోటని కైవసం చేసుకుంది. నివాస రాజ భవనాలను నాశనం చేసింది. ఆ తర్వాత బ్రిటిష్ ఇండియన్ సైన్యానికి కేంద్ర స్థావరంగా మార్చింది.  తిరుగుబాటు జరిగిన వెంటనే బహదూర్ షా జాఫర్ మీద ఎర్రకోటలో విచారణ జరిపించారు. 1945 నవంబరులో ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన ముగ్గురు అధికారులపై సైన్య విచారణ జరిగింది. ఆ తర్వాత 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత.. మన సైన్యం ఈ కోటను కైవసం చేసుకుంది. డిసెంబరు 2003లో భారత సైన్యం.. ఈ కోటను భారత పర్యాటక అధికారులకి అప్పగించింది.


తిరిగి కోట స్వాధీనం
1947 ఆగస్టు, 15న భారత్ స్వాతంత్ర్యం పొందింది.  అదే సందర్భంలో నాటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు.  స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రి దేశీయ పతాకాన్ని ఎగురవేసి ఆ తర్వాత ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మనదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చిన తరువాత ప్రధాని జాతినుద్దేశించి ప్రసగించింది ఇక్కడి నుంచే. ఇలా ఎన్నో సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది లాల్‌ ఖిల్లా.


కోటను నిర్మించిన షాజహాన్ 
ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఈ కోటలో ఒకప్పుడు మొఘల్‌ రాజవంశీయులు నివాసం ఉండే వారు. 1639లో దేశ రాజధాని ఆగ్రా నుంచి  ఢిల్లీకి మారిన తరువాత షాజహాన్‌ చక్రవర్తి ఎర్రకోటను నిర్మించారు. కోటగోడలు ఎర్రటి ఇసుకరాయితో నిర్మించడంతో  ఎర్రకోట అనే పేరు వచ్చింది. మొఘల్‌ పాలనలో రాజకీయ కేంద్రంగా భాసిల్లిన ఈ కోట.. ఇప్పుడు మ్యూజియంలతో పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేస్తారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జవహార్ లాల్ నెహ్రూ మొదటిసారి ఇక్కడే జాతీయ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి అది సంప్రదాయంగా వస్తోంది.  ఢిల్లీలో ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఇదొకటి. ఈ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తాజ్‌మహల్‌ను డిజైన్‌ను చేసిన ఉస్తాద్‌ అహ్మద్‌ లాహౌరి ఈ కోటను డిజైన్‌ చేశారు. కోట లోపల ఉన్న నిర్మాణాలు పర్యాటకులను ఇట్టే అట్రాక్ట్ చేస్తాయి. ముంతాజ్‌ మహల్‌లో ఇప్పుడు ఫోర్ట్‌ మ్యూజియంను ఏర్పాటు చేశారు.


చూసేందుకు రెండు కళ్లు చాలవు
ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రధాని జాతీయ జెండా ఎగుర వేయడంతో ప్రారంభమవుతాయి.  తర్వాత 21 తుపాకుల వందనం, జాతీయ గీతం ఆలపన జరుగుతుంది. ప్రధానమంత్రి  దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గత సంవత్సరంలో దేశం సాధించిన విజయాలను ప్రధాని ప్రసంగం హైలెట్ చేస్తుంది.  స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన  చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పిస్తారు. అలాగే పంద్రాగస్టు రోజున జరిగే పరేడ్‌లో ఎర్రకోట ముందు విన్యాసాలు చేయాలని ఉవ్విళ్లూరని సైనికుడు ఉండడు.  గుర్రాల పైకి ఎక్కి ఎర్రకోటకు వచ్చే అవకాశం తమకు దక్కినందుకు పులకించిపోయే వాళ్లెందరో ఉన్నారు. ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో తన విశిష్టతను అక్కడ ప్రదర్శించాలని పోటీ పడని రాష్ట్రమంటూ ఉండదు. ఇలా ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అంబరాన్నంటే సంబరాలు జరుగుతుంటాయి.