CM Mamata Banerjee:  కోల్‌కతాలో గురువారం ఈడీ దాడులు చేయడంతో హైడ్రామా చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగడం, రహస్యంగా కార్యాలయాల్లోకి ప్రవేశించడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపాయి. ఒక ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో సోదాలు జరుగుతుండగా స్వయంగా ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐ-పాక్ ప్రతినిధులపై ఈడీ దాడులు 

తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐ-పాక్ (I-PAC) అధినేత ప్రతీక్ జైన్ నివాసం,  కార్యాలయాలపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బెంగాల్ బొగ్గు కుంభకోణం ,  పాత నగదు అక్రమ చలామణి కేసులకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.    

 ముఖ్యమంత్రి రాక -  గ్రీన్ ఫైల్ మిస్టరీ 

సోదాలు జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ హుటాహుటిన ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపు లోపల ఉన్న ఆమె, బయటకు వచ్చేటప్పుడు ఒక  గ్రీన్ ఫైల్ ను చేతబట్టుకుని కనిపించారు. ఈ ఫైల్‌లో ఏముంది? దర్యాప్తు సంస్థ సోదాలు చేస్తున్న చోటు నుంచి ముఖ్యమంత్రి ఒక ఫైల్‌ను తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టిఎంసి ఎన్నికల వ్యూహాలను, అభ్యర్థుల జాబితాను కేంద్రం దొంగిలించడానికి ప్రయత్నిస్తోందని మమత ఈ సందర్భంగా ఆరోపించారు.

 బ్యాక్-డోర్ ఎంట్రీ ,  ఫైళ్ల తరలింపు 

ఈడీ దాడుల గురించి తెలుసుకున్న మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయలుదేరి  నేరుగా సాల్ట్ లేక్‌లోని ఐ-పాక్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమె  వెనుక తలుపు  ద్వారా లోపలికి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు,  వీడియో ఆధారాలు చెబుతున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు లోపల ఉన్న మమత మరియు ఆమె సిబ్బంది, మరికొన్ని ఫైళ్లను తమ కారులో తరలించినట్లు సమాచారం. ఈ చర్య దర్యాప్తును అడ్డుకోవడమేనని ఈడీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

 రాజకీయ రణరంగంగా కోల్‌కతా 

ఈ ఘటనపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఒక దర్యాప్తు సంస్థ పనిని అడ్డుకోవడం ముఖ్యమంత్రికి తగదని, ఫైళ్లలో ఏముందో బయటపడుతుందనే భయంతోనే మమత ఇలా ప్రవర్తించారని విమర్శించింది. మరోవైపు మమతా బెనర్జీ ఇది కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు అని, ఎన్నికల వ్యూహాలను దెబ్బతీయడానికే అమిత్ షా ఆదేశాలతో ఈడీ పని చేస్తోందని తిప్పికొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ అధికారులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.