Ratna Bhandar Reopens After 46 Years: 46 ఏళ్ల తరవాత రత్న భాండాగారం తలుపులు (Ratna Bhandar Reopens) తెరిచారు. దాదాపు 11 మంది సిబ్బందితో ఈ ప్రక్రియని పూర్తి చేసింది ప్రభుత్వం. అంతకు ముందే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. తలుపులు తెరవడం అయిపోయింది. మరి తరవాత ఏం చేయనుందన్నదే కీలకంగా మారింది. అసలు ఈ రహస్య గదిలో ఏమున్నాయన్న ఆసక్తికర చర్చ కూడా ఇప్పటికే మొదలైంది. దీనిపై అధికారికంగా ఎక్కడా వివరాలు లేకపోయినా Odisha Magazine మాత్రం కొంత సమాచారం ఇచ్చింది. దీని ఆధారంగా చూస్తే...ఒకప్పటి ఒడిశా రాజు అనగభీమ దేవ్ జగన్నాథుడికి 2.5 లక్షల మధాల బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చాడు. మధ అంటే అర తులం. ఈ రత్న భాండాగారంలో (Ratna Bhandar Mystery) రెండు ఛాంబర్స్ ఉన్నాయి. అందులో ఒకటి భీతర్ భండార్, మరోటి బాహర్ భండార్. అంటే లోపలి గది, బయటి గది అని అర్థం. 


గదిలో ఉన్నవి ఇవేనట..


ఈ మ్యాగజైన్ వెల్లడించిన వివరాల ప్రకారం వెలుపలి ఛాంబర్‌లో జగన్నాథుని కోసం చేయించిన మూడుబంగారు నెక్లెస్‌లున్నాయి. దీన్ని హరిదాకాంతి మాలి అంటారు. ఒక్కో గొలుసు బరువు 120 తులాలు. ఇక లోపలి గదిలో 74 రకాల బంగారు ఆభరణాలున్నాయని మ్యాగజైన్ వెల్లడించింది. ఈ ఆభరణాల్లో ఒక్కో దాని బరువు 100 తులాలు. బంగారం, వజ్రాలు, ముత్యాలతో తయారు చేసిన పళ్లాలూ ఉన్నాయి. వీటితో పాటు 140 రకాల వెండి ఆభరణాలూ ఉన్నాయని తెలిపింది. 


రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను వేరే చోటకు తరలించేందుకు పెద్ద పెట్టెలు తీసుకెళ్లారు. ఈ ప్రక్రియనంతా కెమెరాలో రికార్డ్ చేశారు. అయితే..ఎక్కడా ఈ ఫుటేజ్‌ని బయటకు మాత్రం విడుదల చేయరు. ఈ దృశ్యాలను చాలా సీక్రెట్‌గా ఉంచనున్నారు. ఈ ప్రక్రియలో మొత్తం మూడు దశల వారీగా చేపట్టారు. మొదట వెలుపలి గదిని తెరిచారు. లోపలి ఛాంబర్‌ని తెరిచేందుకు ప్రత్యేక SOPని అనుసరించారు. ఈ రెండింటితో పాటు టెంపరరీ రూమ్‌, స్ట్రాంగ్‌ రూమ్ ఉన్నాయి. రత్న భాండార్ నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌కి ఆభరణాలను తరలిస్తారు. ఆ తరవాతే లెక్కింపు మొదలవుతుంది. ఈ ప్రక్రియే సవాల్‌గా మారనుంది. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా దేవుడే తమను ముందుకు నడిపిస్తాడని నమ్ముతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆభరణాలకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్త తీసుకోనున్నారు. ఈ లెక్కింపునంతా వీడియో రికార్డ్ చేస్తారు. 


డిజిటల్ క్యాటలాగ్‌..


అయితే..1985 తరవాత లోపలి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియదు. అందుకే గది తలుపులు తెరిచిన తరవాత ఏమేం సవాళ్లు ఎదురవుతాయో అంచనా వేయలేమని ముందే అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియను RBI కూడా దగ్గరుండి పర్యవేక్షించింది. ఆభరణాల లెక్కింపు తరవాత ఓ డిజిటల్ క్యాటలాగ్‌ని తయారు చేయనున్నారు. ఇందులో వాటి ఫొటోలు పెట్టి బరువు ఎంతో కూడా వివరాలు పెట్టనున్నారు. వీటన్నింటినీ కలిపి ఓ డాక్యుమెంట్‌లా రూపొందించనున్నారు. రత్న భాండాగారంలో ASI నేతృత్వంలో మరమ్మతులు జరగనున్నాయి. 


Also Read: Ratna Bhandar Reopens: తెరుచుకున్న రత్న భాండాగారం తలుపులు, అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం