BBC Documentary Row:  మంగళవారం (ఫిబ్రవరి 14) ఆదాయపు పన్ను దం ఢిల్లీ, ముంబైలోని బీబీసీ (బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్) కార్యాలయాల్లో  సర్వే నిర్వహించింది. ఈ ఘటన  దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ సర్వేపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఈ సర్వేను అప్రకటిత ఎమర్జెన్సీగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ట్వీట్ చేసింది. అసలు వివాదానికి కారణంగా భావిస్తున్న డాక్యుమెంటరీలో ఏముంది ?  


గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన బీబీసీ  


గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను ప్రశ్నిస్తూ బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' రెండు భాగాలుగా విడుదలైంది. దీని మొదటి ఎపిసోడ్ జనవరి 17న మరియు రెండవ ఎపిసోడ్ జనవరి 24న యూట్యూబ్‌లో విడుదలైంది. మొదటి ఎపిసోడ్ రావడంతో దీనిపై రచ్చ మొదలైంది. ప్రతిపక్ష నేతలు, కొన్ని సంస్థలు బీబీసీ డాక్యుమెంటరీ ద్వారా ప్రధాని మోదీని, బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించాయి. 


డాక్యుమెంటరీని బ్యాన్ చేసిన కేంద్రం ! 


ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో భాగంగాvs బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' అని బీజేపీ ఆరోపిస్తోంది.   బిబిసి డాక్యుమెంటరీ రెండవ ఎపిసోడ్ విడుదలకు ముందు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జనవరి 21న దానిని నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు తర్వాత బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్‌లను యూట్యూబ్ మరియు ట్విట్టర్ నుండి తొలగించారు. ఈ డాక్యుమెంటరీలో భారత ప్రధానిని చూపించిన విధానంతో తాను ఏకీభవించనని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ప్రకటించారు.  బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధాన్ని  పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా విదేశీ మీడియా అభివర్ణించింది.  


డాక్యుమెంటరీ నిషేధంతో వివాదం 


బీబీసీ డాక్యుమెంటరీ విడుదలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో దానిపై దుమారం మొదలైంది. మోదీ ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా జేఎన్‌యూలో డాక్యుమెంటరీ ప్రదర్శన జరిగింది. స్క్రీనింగ్‌ను ఆపాలని ఏబీవీపీ కార్యకర్తలు రాళ్లదాడికి, భౌతిక దాడులకు పాల్పడ్డారని వామపక్ష సంస్థలు ఆరోపించాయి. దీని తరువాత, పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వరకు చాలా చోట్ల దీనిని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధం విధించడంపై కాంగ్రెస్‌తోపాటు అన్ని విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  


బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై  సుప్రీంకోర్టులోనూ విచారణ 


డాక్యుమెంటరీ నిషేధాన్ని  వ్యతిరేకిస్తూ ప్రశాంత్ భూషణ్, ఎన్ రామ్, మహువా మోయిత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధానికి వ్యతిరేకంగా న్యాయవాది మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డాక్యుమెంటరీలోని రెండు ఎపిసోడ్‌లను సుప్రీంకోర్టు ఆదేశించి చూడాలని, దీని ఆధారంగా 2002 గుజరాత్ అల్లర్లలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్‌లో అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్టికల్ 19(1)(2) ప్రకారం 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వార్తలు, వాస్తవాలు మరియు నివేదికలను చూసే హక్కు పౌరులకు ఉందో లేదో సుప్రీంకోర్టు నిర్ణయించాలని కూడా పిటిషన్‌లో పేర్కొంది.ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా  కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తక్షణమే విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు ఏప్రిల్‌లో తదుపరి తేదీని ఇచ్చింది.