Vikram 32 bit chip Semiconductor: భారతదేశం సెమికండక్టర్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది. దేశంలో మొట్టమొదటి స్వదేశీ 32-బిట్ మైక్రోప్రాసెసర్ ‘విక్రమ్’ను సెమికాన్ ఇండియా 2025 సదస్సులో ఆవిష్కరించింది. ఈ చిప్ను ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. ఇది భారతదేశం సెమికండక్టర్ రంగంలోఒక ముఖ్యమైన అడుగు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) కు చెందిన సెమీ-కండక్టర్ లాబొరేటరీ (SCL) ద్వారా అభివృద్ధి చేశారు. ఈ చిప్, అంతరిక్ష ప్రయోగ వాహనాల కఠిన పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు.
విక్రమ్ 3201, ISRO విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) , చండీగఢ్లోని SCL సహకారంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి పూర్తి స్వదేశీ 32-బిట్ మైక్రోప్రాసెసర్. ఈ చిప్ 180 నానోమీటర్ CMOS టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. -55°C నుంచి +125°C వరకు ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఇది అంతరిక్ష ప్రయోగాలకు అనువైనది.
అంతరిక్ష వాహనాల ట్రాజెక్టరీ గణనలు , సెన్సార్ డేటా విశ్లేషణల కోసం అవసరమైన ఖచ్చితమైన గణనలను అందిస్తుంది. Ada ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ ఇస్తుంది. ఏరోస్పేస్ సిస్టమ్స్లో ఉపయోగించే ఈ భాష, సురక్షితమైన , నమ్మదగిన అప్లికేషన్లకు అనుకూలం. రాకెట్లలో ఇతర ఎవియానిక్స్ మాడ్యూల్స్తో సజావుగా కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుంది. ISRO అభివృద్ధి చేసిన కంపైలర్స్, అసెంబ్లర్స్, సిమ్యులేటర్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ (IDE) వంటి సాధనాలు, ఓపెన్-సోర్స్ టూల్చైన్లతో పాటు అందుబాటులో ఉన్నాయి. విక్రమ్ 3201 చిప్, 2024లో PSLV-C60 మిషన్లోని PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM-4)లో విజయవంతంగా పరీక్షించారు.దీని ద్వారా అంతరిక్షంలో దాని నమ్మకమైన పనితీరు చూపించగలిగారు.
సెమికాన్ ఇండియా 2025, న్యూ ఢిల్లీలో సెప్టెంబర్ 2న ప్రారంభమైంది. మూడు రోజుల సదస్సు, 48 దేశాల నుంచి 20,750 మందికి పైగా పాల్గొంటున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ చిప్ డిజైన్ , తయారీ హబ్గా స్థాపించడానికి లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు. “నూనె బ్లాక్ గోల్డ్ అయితే, సెమికండక్టర్ చిప్స్ డిజిటల్ డైమండ్స్” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2021లో ప్రారంభించిన ఇండియా సెమికండక్టర్ మిషన్ (ISM) ద్వారా గత 3.5 సంవత్సరాల్లో కీలక విజయాలు సాధించింది.