Polamaba Jathara 2023: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, గిరిజనుల ఆరాధ్య దైవం శంబర పోలమాంబ జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగ తర్వాత పెద్ద సిరిమానోత్సవం శంబర పోలమాంబదే. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో ఈ ఆలయం ఉంది. ఈ నెల 23న తొలేళ్లు, 24న సిరిమానోత్సవం, 25న అంపకోత్సవం జరగనుంది. కరోనా నేపథ్యంలో గత మూడేళ్లు ఆంక్షల నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గింది. ఈసారి ఎలాంటి ఇబ్బందులూ లేకపోవడంతో లక్షల్లో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి రెండు లక్షల మంది వచ్చినా.. వారికి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో వి.రాధాకృష్ణ తెలిపారు. 


భక్తులకు ఇబ్బందులు లేకుండా మూడు క్యూ లైన్లు..


ఉచిత దర్శనంతో పాటు రూ.10, రూ.50 దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. పులిహోర ప్రసాదం ధర రూ.10, లడ్డూ రూ.15 గా నిర్ణయించారు. విశ్రాంతి భవనాలు, కేశ ఖండన శాల, చెప్పుల స్టాండ్‌, శాశ్వత క్యూలైన్లు లేకపోవడం కొంత ఇబ్బందే.  వీటి గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. 


సిరిమాను తిరిగేందుకు...


ఉత్సవంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం ఈ నెల 24న జరగనుంది. లక్షల్లో భక్తులొస్తారని అంచనా.. ప్రస్తుతం సిరిమాను తిరిగేందుకు వీలుగా ఆ మార్గాన్ని బాగు చేస్తున్నారు. గుంతలను పూడ్చుతున్నారు. గొల్లవీధి నుంచి పెద్దవలస వెళ్లే మార్గంలో 90 మీటర్ల సీసీ రోడ్డు పనులు సాగుతున్నాయి. సిరిమాను గుర్తింపు, తయారీ, ఊరేగింపునకు గతంలో వీధుల వారీగా బృందాలు ఉండేవి. ఆలయ అధికారులు, ట్రస్టుబోర్డు సభ్యులు పర్యవేక్షించేవారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల సమస్యలు ఎదురయ్యేవి. ఈసారి అలా జరగకుండా ధర్మకర్తల పర్యవేక్షణలో ఒకరికే బాధ్యతలు అప్పగించేలా ప్రణాళికలు వేస్తున్నారు. 


వనంగుడి, చదురుగుడి ఆలయాల వద్ద ఎండ నుంచి ఉపశమనం పొందేలా చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేశారు. చిన్నారులకు పాలు, సాధారణ భక్తులకు మంచినీరు అందుబాటులో ఉంచుతున్నారు. గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో వీరు మొదటి వారంలో రాకుండా ఉంటే మంచిదని ఆలయ అధికారులు కోరుతున్నారు. భక్తులకు సేవలు అందించేందుకు వివిధ ఆలయాల నుంచి డిప్యుటేషన్‌పై 95 మంది సిబ్బందిని నియమించారు. పలు స్వచ్ఛంద సంస్థలూ పాల్గొననున్నాయి.


అమ్మవారి ఘటాల ఊరేగింపు..


శంబర జాతర నేపథ్యంలో పోలమాంబ అమ్మవారి ఘటాల ఊరేగింపు వేడుకగా జరిగింది. చదురు గుడిలో ఉంచిన ఘటాలకు గురువారం వేకువజాము నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం గ్రామ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. దారి పొడవునా భక్తులు మొక్కులు చెల్లించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు పరిశీలించారు. శంబర గ్రామానికి చేరుకుని వనంగుడి, చదురు గుడి ఆలయ ప్రాంగణాలను తనిఖీ చేశారు. కూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, సిరిమాను ఉంచే ప్రదేశాలను చూశారు.