Vizag Crime News: అప్పటికే ఆ మహిళకు పెళ్లి జరిగింది. ఓ పిల్లాడు కూడా పుట్టాడు. బాబుతో సహా ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఓ ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. కానీ కొంత కాలం తర్వాత వారిద్దరూ దూరమయ్యారు. అయితే తాజాగా ఆ మహిళ ఓ ఫంక్షన్ కు హాజరైంది. తిరిగి వచ్చే క్రమంలో తనకు గతంలో సంబంధమున్న ఆటో డ్రైవర్ ఆటో ఎక్కింది. ఈ క్రమంలోనే అతడు ఆమెను ఆటోలోనే చంపి మృతదేహాన్ని ఓ చోట పడేశాడు. ఆమె మెడలో ఉన్న బంగారం తీసుకొని పరారయ్యాడు. చిట్ట చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు. 


అసలు ఏం జరిగిందంటే?


విశాఖపట్నం జిల్లా తగరపువలస బాలాజీ నగర్ లో రేపు గోపి అనే మహిళ తన ఏడేళ్ల కుమారుడితో ఒంటరిగా ఉంటోంది. గతంలోనే భర్తతో మనస్పర్థల కారణంగా అతడికి విడాకులు ఇచ్చింది. అయితే తాజాగా ఆమె బంధువుల ఇంట్లో జరుగుతున్న ఓ శుభకార్యానికి వెళ్లింది. తిరిగి ఇంటకి వచ్చేందుకు బయలుదేరింది. అప్పటికే చీకటి పడడం.. తనకు పరిచయం ఉన్న ఆటో డ్రైవర్ కనిపించడంతో బంధువులు ఆమెను ఆ ఆటో ఎక్కించారు. కానీ ఆమె మాత్రం ఇంటికి చేరుకో లేదు. దీంతో బంధువులు తెలిసిన వాళ్లందరినీ అడిగారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 1వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే తెలిసిన వ్యక్తి ఆటోనే ఎక్కించినట్లు బంధువులు చెప్పడంతో.. ఆటో డ్రైవర్ వివరాలు సేకరించారు పోలీసులు. 


నాలుగు తులాల బంగారం కోసమే హత్య..


ఆటో డ్రైవర్ పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు అతడి వద్దకు వెళ్లారు. రేసు గోపి అనే మహిళను ఆటోలో తీసుకెళ్లింది నీవే కదా అని ప్రశ్నించగా అవునన్నాడు. తడబడుతూ సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేపట్టారు. దీంతో ఆటో డ్రైవర్ మైలిపల్లి రాజు నిజాలను బయటకు కక్కాడు. తనకు ఆమెకు గతంలో వివాహేతర సంబంధం ఉందని.. ముందునుంచే తామిద్దరికీ పరిచయం అని వెల్లడించాడు. అలాగే ఆ తర్వాత విడిపోయామని.. తాజాగా ఓ ఫంక్షన్ నుంచి వస్తుండగా తన ఆటోలో ఎక్కిన్నట్లు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఆమె మెడలోనే బంగారాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె గొంతు నులిమి చంపినట్లు స్పష్టం చేశాడు. ఆటోలో ఉన్న ఓ తాడుతో ఆమె గొంతు నులమి చంపానని.. అనంతరం మృతదేహాన్ని చిలుకూరి లేఔట్ గెడ్డలో పడేసినట్లు పేర్కొన్నాడు. అలాగే ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారాన్ని తానే తీసుకున్నట్లు వివరించాడు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం వెతక్కగా... కుళ్లిన స్థితిలో రేసు గోపి మృతదేహం లభ్యమైంది. ఆటోడ్రైవర్ మైలిపల్లి రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేసు గోపి చనిపోవడంతో ఆమె ఏడేళ్ల కుమారుడు ఒంటరిగా మిగిలిపోయాడు.