Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కొంతకాలంగా బెయిల్ పై బయట ఉన్నారు. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఆయన సీబీఐ కోర్టులో లొంగిపోయారు. బెయిల్ రద్దు చేసిన హైకోర్టు.. సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే గంగిరెడ్డి లొంగిపోయారు. గంగిరెడ్డికి న్యాయస్థానం జూన్ 2 వరకు రిమాండ్ విధించింది.


వైఎస్ వివేకా హత్య కేసు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృంగం 2019 మార్చి 28వ తేదీన గంగిరెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే నిర్ధిష్ట వ్యవధిలో ఛార్జిషీట్ దాఖలు చేయడంలో సిట్ విఫలం అయింది. గంగిరెడ్డికి పులివెందులలోని స్థానిక కోర్టు 2019 జూన్ 27వ తేదీన డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సీబీఐ విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసి.. ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డిని ఏ1గా పేర్కొంది. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. అయితే సీబీఐ పిటిషన్ కోర్టు కొట్టి వేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. 


సాక్షులను బెదిరిస్తూ.. ఆటంకం కల్గిస్తున్నారని ఆరోపణ


ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్ లో ఆ హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఏపీ నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తూ, విచారణకు ఆటంకం కల్గిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. మరోవైపు గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సీబీఐ వద్ద సాక్ష్యాధారాలు లేవని ఆయన తరఫు లాయర్ పేర్కొన్నారు. అయితే ఇరువైపుల వాదనల అనంతరం.. సీబీఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. మే 5వ తేదీలోగా ఎర్ర గంగిరెడ్డి సీబఐ కోర్టులో లొంగిపోవాలని అలా కాని పక్షంలో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసేందుకు అనుమతించింది. ఈ క్రమంలోనే నేడు నాంపల్లలిలో నేడు నాంపల్లిలోలని సీబీఐ కోర్టుకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి న్యాయవాదుల సమక్షంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. 


వివేకా రైట్ హ్యాండ్ ఎర్ర గంగిరెడ్డి..!


ఎర్ర గంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా తొండూరు మండలం తేలూరు. గత 30 ఏళ్లుగా వివేకానందరెడ్డి, వైఎస్‌ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకాకు ఆయన ప్రాణమిత్రుడు లాంటి వారు.  వివేకాతో పాటే ఎప్పుడూ కనిపించేవారు. ఎర్ర గంగిరెడ్డి అవివాహితుడు. నూనె వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో వివేకాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయంగానూ ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పటికి కూడా వివేక తనకు దేవుడని ఆయన చెబుతుంటారు. ఆయనను హత్య చేయాల్సిన అవసరం కానీ.. హత్య చేయించడానికి ప్లాన్ చేయాల్సిన అవసరం కానీ లేదని చెబుతున్నారు. రంగయ్యతో అసలు పరిచయమే లేదని.. వాచ్‌మెన్‌గా చూశాను తప్ప.. ఎప్పుడూ మాట్లాడలేదని వివిధ ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పష్టం చేస్తున్నారు.