నూతన సంవత్సర వేళ బెజవాడలో విషాదం చోటుచేసుకుంది. చెత్త డంపింగ్ యార్డ్ లో వాహనం తిరగబడి ఓ వ్యక్తి మృతి చెందారు.


బెజవాడ చెత్త డంపింగ్ యార్డ్ లో ప్రమాదం.... 
బెజవాడ చెత్త డంపింగ్ యార్డ్ లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందిన వెంటనే సింగినగర్ సీఐ లక్ష్మీనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిచిన వివరాలను స్థానికుల నుంచి సేకరించారు. లైసెన్సు లేని డ్రైవర్లు చెత్త తొలగింపు జేసీబీలను నడపటం వలన ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో అధికారలు నిర్లక్ష్యంగా వ్యవహిరంచటం వలనే ప్రమాదం జరిగిందని అంటున్నారు.


కార్మిక సంఘాల ఆందోళన...
ప్రమాదంపై కార్మిక సంఘాల నాయకులు, స్థానిక సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని  మండిపడ్డారు. కార్మికులకు కనీస రక్షణ సదుపాయాలు లేకపోవటంతోనే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ విషయాలను అధికారులకు ముందుగానే చెప్పామని, అయినా స్పందించలేని అంటున్నారు. ఫలితంగా ఇప్పుడు ప్రమాదం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


లోకాయుక్తలో ఫిర్యాదు....


డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న అక్రమ వ్యవహరాల పై గతంలోనే లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపో లో పని చేసే డ్రైవర్లపై మూడు, నాలుగు నెలల కిందట లోకాయుక్తలో ఫిర్యాదు వచ్చాయి.


లైసెన్సులు లేని డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారని, డీజిల్ ను కూడా బయట అమ్ముకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ కు  స్పందనలో ఫిర్యాదు చేసినా ఏటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, లోకాయుక్త ఆశ్రయించినట్లు స్థానిక మానవ హక్కుల సంఘం నాయకులు చెబుతున్నారు. వెహికల్ డిపోలో జరుగుతున్న అక్రమాలని కమిషనర్ కు ఫిర్యాదు చేసినా రాజకీయ ఒత్తిళ్లతో వాటిని పక్కన పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు.


డంపింగ్ యార్డ్ తరలింపు రాజకీయం... 
అజిత్ సింగ్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించాలని పలుమార్లు రాజకీయ పార్టీలు ఆందోళనలు  చేశాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీచెత్త డంపింగ్ యార్డు ను కేంద్రంగా చేసుకొని రాజకీయం నడపడటం ఆనవాయితీగా వస్తుంది. ఫలితంగా ఇటీవల వైసీపీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న తరువాత, ప్రతిపక్షంగా ఉన్న సమయంలో ఆందోళన చేసిన విషయం పరిగణంలోకి తీసుకొని చెత్త యార్డ్ తరలింపు చేయాలని కౌన్సిల్ లో తీర్మానం కూడా చేశారు. అయితే కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికి తరలింపు అంశం ఇంకా కార్యాచరణలోకి రాలేదు. ఇదే సమయంలో ప్రమాదం జరగటం, ఒకరు చనిపోవడంతో స్థానికంగా మరోసారి కలకలం రేపింది.


డంపింగ్ యార్డ్ తో స్థానికులకు అవస్థలు... 
చెత్త డంపింగ్ యార్డ్ తో స్థానికులు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు పారిశుధ్య సమస్య తలెత్తి, ఈగలు, దోమలు వంటి క్రిమి కీటకాలతో ప్రజా రోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. చెత్త నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేసినప్పటికీ ప్రాజెక్ట్ సక్సెస్ కాకపోవటంతో టన్నుల కొద్ది చెత్త డంపింగ్ యార్డ్ కే పరిమితం అయ్యింది. దీంతో స్థానికులు అనారోగ్యానికి గురయ్యి, ఇళ్లను సైతం ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.