UP Politics Operation Lotus 2026.  ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సమాజ్ వాదీ పార్టీ ని లక్ష్యంగా చేసుకుని అధికార ఎన్డీయే కూటమి సరికొత్త వ్యూహాలకు తెరలేపింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో  పార్టీల ఎంపీలు చీలిపోయి ఎన్డీఏకు మద్దతు ప్రకటించడంతో   యూపీలోనూ అదే తరహా  రాజకీయాలు జరుగుతాయన్న చర్చ ప్రారంభమయింది.  యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్‌లో మంత్రి, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ చేసిన సంచలన వ్యాఖ్యలు యూపీ రాజకీయాల్లో పెను తుఫానును సృష్టించాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన దాదాపు 21 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఎస్పీలో భారీ చీలిక రాబోతోందని ఆయన ప్రకటించారు.    స్కామ్‌ల ఉచ్చు.. లొంగిపోతారంటున్న మంత్రి రాజ్‌భర్! 

Continues below advertisement

యూపీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భర్ తన సోషల్ మీడియా వేదికగా ఎస్పీ అగ్రనేత రామ్ గోపాల్ యాదవ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక రహస్య లేఖ సమర్పించారని ఆరోపించారు. యూపీని గతంలో కుదిపేసిన మైనింగ్ కుంభకోణం, గోమతి రివర్ ఫ్రంట్ స్కామ్‌ల మాస్టర్‌మైండ్ ఎవరో అందరికీ తెలుసని.. ఇప్పుడు ఆ కేసుల ఉచ్చు గట్టిగా బిగుస్తుండటంతో ఎస్పీ నేతల్లో ఆందోళన మొదలైందని ఆయన పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల భయంతో ,  నియోజకవర్గాల నిధుల కోసమే స మొత్తం సమాజ్ వాదీ పార్టీ  బీజేపీలో చేరేందుకు లోపాయకారీగా లైన్ క్లియర్ చేసుకుంటోందని, అందులో భాగంగానే 21 మందికి పైగా ఎంపీలు టచ్‌లోకి వచ్చారని రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 అఖిలేష్ యాదవ్ ఫైర్..  ఓడిపోయిన బీజేపీ మైండ్ గేమ్స్ ! 

మంత్రి రాజ్‌భర్ చేసిన ఈ మైండ్ గేమ్‌పై సమాజ్ వాదీ పార్టీ అధినేత, లోక్‌సభ ఎంపీ అఖిలేష్ యాదవ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఇవన్నీ కేవలం ఓటమి భయంతో బీజేపీ ఆడుతున్న చౌకబారు నాటకాలని కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీ ప్రజలు బీజేపీకి గట్టి బుద్ధి చెప్పారని, ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం లోక్‌సభలో 37 స్థానాలతో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ  పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని, తమ పార్టీ ఎంపీలు ఎవరూ కూడా ప్రలోభాలకు లొంగే ప్రసక్తే లేదని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.  

2027 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.. కాంగ్రెస్‌తోనే మైత్రి! 

పార్టీలో చీలిక వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అఖిలేష్ తిప్పికొడుతూ.. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉమ్మడిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఏ విధంగానైతే మట్టికరిపించామో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫార్ములాతో యోగి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పునరుద్ఘాటించారు. ప్రతిపక్షాల మధ్య విభేదాలు సృష్టించి మైలేజ్ పొందాలని చూస్తున్న బీజేపీ పప్పులు ఉమ్మడి యూపీలో ఉడకవని, అసలైన ప్రజా సమస్యలైన నిరుద్యోగం, ఆరోగ్య రంగా పతనంపై మాట్లాడకుండా అధికార పక్షం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. 

 ఉత్కంఠ రేపుతోన్న యూపీ రాజకీయం.. తదుపరి అడుగు ఎటు 

మహారాష్ట్రలో శివసేన కి చెందిన ఎంపీలు షిండే వర్గంలో విలీనం అయ్యారు.   రాజ్‌భర్ చేసిన ఈ వ్యాఖ్యలు యూపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. లోక్‌సభలో మేజిక్ ఫిగర్ దాటినప్పటికీ, విపక్షాల బలాన్ని మరింత కుంగదీయాలనే వ్యూహంతో బీజేపీ ఆపరేషన్ లోటస్ ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, అఖిలేష్ యాదవ్ తన ఎంపీలు,  కేడర్‌ను కాపాడుకుంటూ 2027 పోరుకు ఎలా సిద్ధం కాబోతున్నారనేది రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల సరళిని శాసించనుంది.