ISI Honey Trap: సోషల్ మీడియా ద్వారా హనీట్రాప్లు వేసి డబ్బులు వసూలు చేసే వాళ్లను చూలా మందిని చూశాం కానీ ఇది భిన్నమైన స్టోరీ. హనీ ట్రాప్ చేయడమే కాదు..డబ్బులు కూడా ఎదురిచ్చారు. అయితే అత్యంత విలువైన సమాచారాన్ని సేకరించారు. దేశ రక్షణకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించారు. అలా సేకరించింది పాకిస్తాన్ కు చెందిన వారుగా గుర్తించారు.
యూపీలోని ఫిరోజాబాద్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చార్జి మ్యాన్ గా పని చేస్తున్న ఉద్యోగి ఒకరు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని భద్రతాదళాలు గుర్తించాయి. ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ఆగ్రాకు చెందిన రవీంద్ర కుమార్ , అతని స్నేహితుడ్ని అరెస్టు చేశారు.
రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్లోని హజ్రత్పూర్కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. కొద్ది కాలంగా సీక్రెట్ గా సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఫ్యాక్టరీలో రోజువారీ ఉత్పత్తి నివేదికలు, స్క్రీనింగ్ కమిటీ రహస్య లేఖలు, పెండింగ్లో ఉన్న పనుల వివరాలు, డ్రోన్ల వివరాలు, అలాగే గగన్యాన్ ప్రాజెక్ట్ వివరాలు వంటివి సేకరిస్తున్నారు. వాటిని తనకు ఫేస్ బుక్లో నేహాశర్మ పేరుతో పరిచయమైన వ్యక్తికి పంపుతున్నారు.
నేహా శర్మ పేరుతో ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా రవీంద్రకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. దాన్ని రవీంద్ర అంగీకరించారు . దాంతో వారిద్దరూ చాటింగ్ ప్రారంభించారు. రవీంద్ర నేహాశర్మ నంబర్ను చందన్ స్టోర్ కీపర్ 2 పేరుతో సేవ్ చేసుకున్నాడు. నేహాశర్మ సున్నితమైన సమాచారం అడుగుతుందని తెలిసినప్పటికీ.. రవీంద్ర వాటిని అక్రమంగా సేకరించించి పంపాడు. ఈ విషయం తెలియడంతో అతడని అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన తర్వాత యుపి ఎటిఎస్ సిబ్బంది రవీంద్ర మొబైల్ ఫోన్ చెక్ చేశారు. అందులో సున్నితమైన సమాచారాన్ని కనుగొంన్నారు. వాటిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మరియు 51 గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ సీనియర్ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ ట్రయల్స్ గురించి రహస్య వివరాలు ఉన్నాయి. అతను పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్లతో ప్రత్యక్ష సంభాషణను కొనసాగించాడని, భారతదేశ రక్షణ ప్రాజెక్టులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అందించాడని అధికారులు ప్రకటించారు. ఆగ్రా నుండి రవీంద్ర సహచరులలో ఒకరిని కూడా ATS అధికారులు అదుపులోకి తీసుకున్నారు.