ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో భాజపా సీనియర్ నేతలతో దాదాపు మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు.

 

ఈ సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ పాల్గొన్నారు. యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యోగి ఆదిత్యనాథ్ త్వరలోనే తన కేబినెట్ ను విస్తరించనున్నట్లు ఏబీపీ సమాచారం.

 

కేబినెట్ విస్తరణ..

 

ప్రాంతీయ, సామాజిక, కుల ప్రాతిపదికన మరో  5-7 మంత్రులను తీసుకోవడం ఉత్తమమని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై రానున్న మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ తేదీని ఖరారు చేయనున్నారు. మరో 15 రోజుల్లోనే ఈ కేబినెట్ విస్తరణ పూర్తి కానుందట. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది. కొత్తగా ఐదు నుంచి ఏడుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

 

రక్షా బంధన్ తర్వాత లఖ్ నవూలో ఈ మేరకు ఓ సమావేశం జరగనుందట. ఈ భేటీలో ఎవరికి మంత్రులుగా అవకాశం ఇవ్వనున్నారో చర్చించనున్నారు.

 

ప్రస్తుత కేబినెట్..

 

ప్రస్తుతం యోగి కేబినెట్ లో మొత్తం 54 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో 23 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర మంత్రులు, 22 మంది రాష్ట్ర మంత్రులు. నిబంధనల ప్రకారం మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఓబీసీ, బ్రాహ్మణ సహా ఇతర కులాల నుంచి కొంత మందికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

 

జేపీ నడ్డా..

 

ఈ నెల 23న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యూపీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడనున్నారు. ఈ భేటీలో బూత్ హెడ్స్ సహా 2,700 మంది సెక్టార్ హెడ్స్ తో నడ్డా భేటీ అవుతారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సమావేశం నుంచే కార్యకర్తను సమాయాత్తం చేయనున్నారు నడ్డా.