UP Budget 2023 Highlights: 


రూ.6.9 లక్షల కోట్ల పద్దు


యూపీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది యోగి సర్కార్. మొత్తం రూ.6.9 లక్షల కోట్లతో పద్దు తయారు చేసిన ప్రభుత్వం మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతులు, యువత సంక్షేమం, మహిళా సాధికారతపై ఎక్కువగా దృష్టి పెట్టింది. "నయా ఉత్తర ప్రదేశ్" లక్ష్యానికి అనుగుణంగా ఈ బడ్జెట్‌ అవకాశం కల్పిస్తుందని అన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 






బడ్జెట్ హైలైట్స్ ఇవే..


1. రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.21,159 కోట్లు కేటాయించారు. అదే సమయంలో వీటి నిర్వహణకు రూ.6,209 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌ కింద పలు కార్యక్రమాల కోసం రూ.  12,631 కోట్లు అందజేసింది యూపీ సర్కార్. 
2. మెట్రో రైల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది యూపీ ప్రభుత్వం. వారణాసి, గోరఖ్‌పూర్‌లో మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ కోసం రూ.100కోట్లు కేటాయించింది. కాన్‌పూర్, ఆగ్రా మెట్రో ప్రాజెక్టుల కోసం వరుసగా రూ.585,రూ.465 కోట్లు కేటాయింపులు జరిగాయి. 
3.స్వామి వివేకానంద యూత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్‌లో భాగంగా అర్హులైన విద్యార్థులందరికీ ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం రూ.3,600 కోట్లు కేటాయించింది. 
4.మదర్సాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి మదర్సాకు రూ.లక్ష కేటాయించింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం యూపీలో మొత్తం 23 వేల మదర్సాలున్నట్టు అంచనా. వీటిలో 561 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం అందించే గ్రాంట్‌లు లభిస్తాయి. 
5.గ్రాడ్యుయేట్ టీచర్లకు నెలకు రూ.6 వేలు, BED టీచర్లకు నెలకు రూ.12 వేలు అందిచనున్నారు. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌లు బోధించే టీచర్లు ఇందుకు అర్హులు. 
6. ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కోసం రూ.1,050 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. వితంతువులకు ఆర్థిక సహకారం అందించేందుకు రూ.4,032 కోట్లు కేటాయించారు. అన్ని వర్గాలకు చెందిన అమ్మాయిలకు వివాహం కోసం సామూహిక వివాహ్ స్కీమ్ కింద రూ.600 కోట్లు కేటాయించింది. 
7. ప్రతి హోళి, దీపావళి పండుగల సమయాల్లో ఉజ్వల యోజన కింద అర్హులైన వారందరికీ ఉచితంగా సిలిండర్ అందజేయనున్నారు. ఇందుకోసం రూ.కోటి 74 లక్షలు కేటాయించింది ప్రభుత్వం. 
8. వృద్ధుల పింఛన్ కోసం రూ. 7,248 కోట్లు కేటాయింపులు జరిగాయి. దివ్యాంగ్ పెన్షన్ యోజనకు ప్రత్యేకంగా రూ. 1,120 కోట్లు కేటాయించారు.