Uber company in Hyderabad: ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఉబర్ కంపెనీ హైదరాబాద్ లో తమ సేవలను విస్తరించనుంది. దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఉబెర్ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది. ఉబర్ కంపెనీ అమెరికా తర్వాత అతి పెద్ద టెక్ సెంటర్ ను హైదరాబాద్ లోనే నిర్వహిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా తమ మొబిలిటీ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ  ప్రాజెక్టుతో సుమారు 1000 మంది ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. 


హైదరాబాద్‌లో రెండు వినూత్న సేవలను పరిచయం చేయాలని ఈ కంపెనీ నిర్ణయించింది. ఉబెర్ గ్రీన్ పేరుతో  జీరో-ఎమిషన్ ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్‌లకు ప్రత్యేక యాక్సెస్‌ను అందిస్తుంది. ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలపై ప్రీమియం, సమర్థమైన రైడ్‌లను అందించడానికి ఉబెర్ షటిలో సర్వీస్ ను ప్రవేశపెట్టనుంది. 


తెలంగాణలో పర్యావరణ సంరక్షణ బాధ్యతగా తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉబెర్ విస్తరణ, హైదరాబాద్‌లో కంపెనీ కొత్త సేవలతో రాష్ట్రంలో మొబిలిటీ మరియు ఆటోమోటివ్ రంగం వృద్ధి చెందనుంది.