Twitter Layoffs: ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఎలాన్ మస్క్.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చి రాగానే చాలా మంది ఉద్యోగులను తీసేసిన మస్క్.. లేఆఫ్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు. తాజాగా ఔట్‌సోర్సింగ్‌ విభాగంలోనూ మస్క్ కోతలు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 4400 నుంచి 5500 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ట్విట్టర్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.


నోటీసులు లేకుండా!


అమెరికా సహా ఇతర దేశాల్లోని ట్విట్టర్ ఆఫీసుల్లో ఈ లేఆఫ్‌లు కొనసాగినట్లు సమాచారం. ట్విట్టర్‌కు చెందిన కంటెంట్‌ మోడరేషన్, రియల్‌ ఎస్టేట్‌, మార్కెటింగ్, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తీసేశారు. అయితే వీరికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి పంపించేశారట.


కంపెనీ ఈ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట. వీరిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారట. అయితే తాజా కోతలపై ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.


మస్క్ మామ


శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీసులో ఇటీవల ఉద్యోగులతో మస్క్ సమావేశమైనట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ సమావేశం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.


" మరింత ఆదాయాన్ని ఆర్జించడంలో విఫలమైతే ట్విట్టర్ దివాలా తీసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది కష్టపడి పనిచేయాలి. కంపెనీ ఇచ్చే చిన్న చిన్న ప్రయోజనాలను కూడా వదులుకునేందుకు సిద్ధపడాలి.                                 "
-         ఎలాన్ మస్క్


లేఆఫ్‌లు


ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత మస్క్.. లేఆఫ్‌ల నిర్ణయం తీసుకున్నారు. చాలా మందిని తొలగించారు. ఇప్పుడు ఉద్యోగులకు మరో ఝలక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈవో స్థాయిలో తొలిసారి ఉద్యోగులకు మెయిల్ పంపారు. "కఠినమైన సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి" అని మెయిల్ చేశారు మస్క్.


అంతే కాదు. ఎంప్లాయిస్ అందరూ కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాళ్లకు మినహాయింపునిస్తానని స్పష్టం చేశారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ని కూడా పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. Bloomberg రిపోర్ట్ ప్రకారం...ఇప్పటికే ఎలన్ మస్క్ అందరి ఉద్యోగులకు "వర్క్ ఫ్రమ్ హోమ్‌ను" తొలగిస్తున్నట్టు మెయిల్ పంపారు.


వారానికి కనీసం 40 గంటల పాటు పని చేయాలని ఆదేశించారు. ట్విట్టర్ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో దాచాల్సిన పని లేదని అది అందరికీ తెలిసిన విషయమేనని మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు కూర్చుని నింపాదిగా మాట్లాడుకోవాల్సిన సమయం కాదని, కేవలం యాడ్స్ ద్వారా వచ్చిన రెవెన్యూతోనే ట్విట్టర్ నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అందుకే...ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాలని తేల్చి చెప్పారు.


Also Read: Elon Musk: సారీ చెప్పిన ఎలాన్ మస్క్! ట్విట్టర్‌తో పెట్టుకుంటే అంతే మరి!