TVK leader Vijay adopt Jayalalithaa strategy for safe campaigns: తమిళగ వెట్రి కజగం నాయకుడు విజయ్ తిరిగి పార్టీ ప్రచారం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కరూర్ తొక్కిసలాట లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా విజయ్ రోడ్షోలను రద్దు చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సెప్టెంబర్లో కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ ప్రజల్లోకి రాలేదు. త్వరలో ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది . రాష్ట్రవ్యాప్తంగా తన ప్రచార సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. భవిష్యత్ కార్యక్రమాల సమయంలో కరూర్ తొక్కిసలాట లాంటి పరిస్థితిని నివారించడానికి టీవీకే కార్యకర్తలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ ప్రచారంలో 41 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది పిల్లలు , 15 మందికి పైగా మహిళలు ఉన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేసినప్పటికీ, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును చేపట్టింది.
పరిణామాల గురించి తెలిసిన వ్యక్తులు విజయ్ ఇకపై రోడ్షోలకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. తన అనుచరులు ఆయన కోసం చేజింగ్ చేయడం, మార్గమధ్యలో ప్రమాదాలను నివారించడానికి, విజయ్ ప్రచార వేదికలకు హెలికాప్టర్లో వెళ్లాలని యోచిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రచార శైలిని అనుసరించే అవకాశం ఉందని టీవీకే సీనియర్ నేత చెబుతున్నారు. లక్ష మందికి వసతి కల్పించగల ప్రాంతంలో నగరం వెలుపల జనాన్ని సమీకరించి.. విజయ్ హెలికాప్టర్లో వేదికకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. పార్టీ ఇప్పటికే ఒక సంవత్సరం పాటు బెంగళూరు హెలికాప్టర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని కార్యక్రమానికి 15 నిమిషాల ముందు విజయ్ ప్రచార వేదికకు హెలికాప్టర్లో చేరుకుంటారంటున్నారు.
తమిళనాడు అసెంబ్లీలో ఇటీవల జరిగిన విషాదంపై జరిగిన చర్చలో, ముఖ్యమంత్రి స్టాలిన్.. విజయ్ ప్రచార స్థలానికి చేరుకోవడంలో ఏడు గంటలు ఆలస్యం కావడమే ఈ విషాదానికి ప్రధాన కారణమని స్టాలిన్ అన్నారు. ఈ రాజకీయం ఇలా సాగుతూనే ఉంది. కరూర్ తొక్కిసలాట బాధితులకు సంతాపం తెలియచేస్తూ టీవీ పార్టీ కార్యకర్తలు దీపావళికూడా జరుపుకోలేదు. మరోసారి తన ప్రచారసభల్లో విషాదాలు జరిగితే.. ఆయనపై తీవ్రమైన వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉంది. అందుకే విజయ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.