TTD News: తిరుమల వైకుంఠ ద్వాదశి పర్వదినం పురస్కరించుకుని వైకుంఠ ద్వార దర్శనం ఇంకా కొనసాగుతుంది. టైం స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతి ఇస్తుంది. దీంతో టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమల యాత్రకు వస్తున్నారు. సోమవారం ఒక్క రోజే(జనవరి 2) 69, 414 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 18,612 మంది తలనీలాలు సమర్పించగా, 7.68 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతుంది.


బెల్లంతో కలిపిన నువ్వుల పిండి నైవేద్యంగా..


శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి అర్చకులు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇందులో‌ భాగంగా వైకుంఠ ద్వాదశి రోజున ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి రచించిన పాసురాల పఠనం చేసి స్వామి వారిని మేలుకొల్పారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాస మూర్తి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాస మూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.


ప్రతీ మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మరాధన


సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండో గంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "మంగళ వారం" రోజు నిర్వహించే "అష్టదళపాద పద్మరాధన" 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడం ఈ సేవ విశేషం. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. 


చివరి సేవగా ఏకాంత సేవ నిర్వహణ..


ఆ తర్వాత అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంకాలం సహస్ర దీపాల కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం జరిపిస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసిన అనంతరం శ్రీవారికి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. ఈ కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.