Nandini Ghee Issue: తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి నిత్య అన్నదాన ప్రసాదాల, లడ్డు ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపణలతో దుమారం చెలరేగింది. కేఎంఎఫ్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలకు టీటీడీ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. రెండేళ్లుగా గిట్టుబాటు కాక టీటీడీకి నెయ్యి సరఫరానే నిలిపి వేసి కనీసం టెండర్ ప్రక్రియలోనూ పాల్గొనని కేఏంఎఫ్ ఆరోపణలపై టీటీడీ స్పందించింది. నాణ్యత విషయంలో రాజీ పడేదిలేదంటున్న టీటీడీ నామినేషన్ పద్దతిలో నెయ్యిని ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉండదంటోంది.


తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం టీటీడీ ఏటా 5 వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. ప్రధానంగా శ్రీవారి లడ్డూల తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు 5 వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ అధికారికంగా ప్రకటించింది. టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడం ఒక కమిటీతో పాటు టీటీడీ బోర్డ్ కమిటీ ఆ తర్వాత పాలక మండలి తీర్మానం పొంది నెయ్యిని కొనుగోలు చేస్తోంది. నెయ్యి నాణ్యత విషయంలోనూ రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన లేబరేటరీని కూడా టీటీడీ తిరుమలలో ఏర్పాటు చేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఇ- ప్రోక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. ఈ మేరకు ప్రతి ఏటా రెండు సార్లు టెండర్లు పిలుస్తోంది. 2023 మార్చిలో 20 లక్షల కేజీల నెయ్యి కొనుగోలు కోసం టెండర్లను పిలిచిన టీటీడీ 6 మంది ట్రేడర్లు పాల్గొంటే అందులో ఇద్దరిని ఎంపిక చేసింది.


ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రీమియర్ L-1 గా, L-2 గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి రూ. 424 లు ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. 65 శాతం నెయ్యిని L-1 నుంచి, మరో 35 శాతం నెయ్యిని L-2 నుంచి కొనుగోలు చేస్తున్న టీటీడీ తిరిగి అక్టోబర్ నెలలో మరో 6 మాసాలకు సరిపడా 20 లక్షల కేజీల నెయ్యిని కొనుగోలుకు టెండర్లను పిలవనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకునే పనిలో ఉంది. అయితే 2021 మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి టీటీడీకి సప్లై అయింది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L-3 గా నిలిచిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 20 లక్షల కేజీల నెయ్యిలో కేవలం 20 శాతం మాత్రమే L-1, L-2 అనుమతితో నెయ్యిని టీటీడీకి సప్లై చేసింది. ఆ తర్వాత టెండర్ ప్రక్రియ లోనే పాల్గొనని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టీటీడీకి తక్కువ ధరకే నెయ్యిని టీటీడీకి సరఫరా చేయాల్సి వస్తుందన్న సాకును ఎత్తి చూపింది. 


టీటీడీకి నెయ్యిని సరఫరా చేస్తే నష్టాలు వస్తాయంటూ కేఎంఎఫ్ ప్రెసిడెంట్ భీమా నాయక్ చేసిన ఆరోపణలు దుమారం రేపడంతో టీటీడీ కూడా స్పందించింది. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏడాదికి 5వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్న టీటీడీ.. నెయ్యితో పాటు అన్నీ ఇ-ప్రోకూర్మెంట్ ద్వారానే కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. నెయ్యి నాణ్యత లో రాజీ లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతోంది. లోయస్ట్ ప్రైస్ ఆఫర్ చేసిన L-1 కాంట్రాక్టర్ నుంచి మాత్రమే సప్లై జరుగుతుందని 20 ఏళ్లుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టీటీడీకి నెయ్యి సప్లై చేస్తుందన్నది కరెక్ట్ కాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. 2023 మార్చిలో నెయ్యి కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియలోనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పార్టిసిపేట్ చేయనే లేదన్నారు. టీటీడీ ప్రభుత్వ సంస్థ అని నామినేషన్ పద్ధతిలో ఎవరి నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేసే అవకాశం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.