CM Revanth Reddy responds over Rahul Gandhi: అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని (Rahul Gandhi) ఓ ఆలయంలోకి వెళ్తుండగా అడ్డుకున్న ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆలయ సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. రాహుల్ గాంధీ యాత్రకు అడుగుఅడుగునా అడ్డంకులు పెడుతున్నారని రేవంత్ విమర్శించారు. రాహుల్ మానసిక స్థైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని.. ఎవరి కుట్రలు ఫలించబోవని అన్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరింత మనోధైర్యంతో ముందుకు సాగుతారని అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు.


‘‘భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదు. రాహుల్ భద్రత విషయంలో సైతం అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారు. ఈ దేశ ప్రజల మద్ధతు ఆయనకు ఉంది. తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుంది.’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.