Telangana CM Revanth Reddy in Delhi ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇటీవల సీఎంగా ప్రమాణ స్వీకారానికి పార్టీ పెద్దలను ఆహ్వానించేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లారు. తన ఎంపీ పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అగ్రనేతల్లో ఒకరైన మాణిక్యం ఠాకూర్ స్వయంగా రేవంత్ రెడ్డిని స్పీకర్ ఓం బిర్లా వద్దకు తీసుకెళ్లారు. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా లేఖను స్పీకర్ బిర్లాకు రేవంత్ రెడ్డి సమర్పించారు.


అనంతరం కాంగ్రెస్ అధిష్టానంతో రాష్ట్ర రాజకీయాలు, కేబినెట్ అంశాలపై చర్చించడానికి వెళ్లారు. రాష్ట్రంలో సీఎం సహా మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇప్పటికే ప్రమాణం చేసిన మంత్రులకు శాఖ కేటాయింపుతోపాటు కేబినెట్‌లో ఉన్న మంత్రి పదవుల ఖాళీల భర్తీపై చర్చిస్తారని తెలుస్తోంది.  ఈ విషయపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుడటంతో రాత్రిలోగా కేబినెట్ ఇతర మంత్రుల పేర్లు ఖరారు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారని సమాచారం.