Telangana CM Revanth Reddy First Speech In Assembly: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ను అభినందిస్తూ మాట్లాడారు. తొలి స్పీచ్‌లో ఆయన ఏమన్నారంటే..." మూడో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకారం అందించిన బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ కాంగ్రెస్‌ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇదే సంప్రదాయం భవిష్యత్‌లో కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరి సహకారం అందరి సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకుంటే తెలంగాణ ఆకాంక్షను సభ ద్వారా పరిష్కరించవచ్చు. 


గడ్డం ప్రసాద్‌ నా సొంత జిల్లా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీకి చెందిన వ్యక్తి. వికారాబాద్‌కు చరిత్రలోనే గొప్ప పేరు ఉంది. నిజాం టైంలో రోగులకు వికారాబాద్‌ గుట్టపై వైద్యం చేసే వాళ్లు. ఇప్పటికీ అక్కడ గాలి నీరు నేల వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన మూడో శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలో సమాజంలోని ఎన్నో రుగ్మతలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాను. 


అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యత తీసుకొని పైకి వచ్చిన వ్యక్తి. 8 మంది ఆడపడుచులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ ఈరోజుకి కూడా చూసుకుంటున్నారని గుర్తు చేశారు. శాసనసభను కూడా కుటుంబంలా భావించి అందరి సభ్యులను సమానదృష్టితో చూస్తారని అనుకుంటున్నాను. ఉమ్మడి కుటుంబాన్ని సమన్వయం చేసిన వ్యక్తి సభకు సభాధ్యక్షుడైతే అందరి సభ్యుల హక్కులు కాపాడతారు. 


ఎంపీటీసీగా రాజకీయ ప్రస్తానం మొదలైంది. 2008 ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిగా సేవలు అందించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కరించడంలో చొరవ చూపారు. జైపాల్‌ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సహకారంతో వికారాబాద్‌ను శాటిలైట్‌ టౌన్‌గా తీర్చిదిద్దారు. మెడికల్‌ కాలేజీ కోసం కూడా చాలా శ్రమపడ్డారు. ఏ పదవిలో ఉన్నా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా ఎప్పుడూ ప్రజలకు దూరంగా లేరు. ప్రసాద్‌ కుమార్‌ లాంటి వ్యక్తులు సునిశిత దృష్టితో శాసనసభ్యుల సహకారం సమన్వయంతో సభను నడిపించడానికి మార్గదర్శనం చేస్తారు. అని పేర్కొన్నారు. 
 
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏమన్నారంటే... స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు అభినందనలు. ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికను ఏకగ్రీవం చేసిన తీరు చాలా ప్రశంసనీయం. పేదల సమస్యలు తెలిసిన వ్యక్తిగా మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి అనుభవం ఈ సభలో ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఉపయోగపడుతుంది. 


రాష్ట్ర సర్వతోముఖా అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే చర్చలు అర్ధవంతంగా ప్రజాసమస్యల పరిష్కారం దిశగా జరగడానికి మీ సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రజల ఇబ్బందులు, సమస్యల పై లోతుగా చర్చించడానికి సభలో సభ్యులకు అత్యంత సమయం ఇస్తారని భావిస్తున్నాను. గౌరవ సభ్యులు కూడా వారి గౌరవాన్ని కాపాడుకుంటూ సభ మర్యాదలను పాటిస్తూ వారి హక్కులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాసమస్యలపై సభలో లోతుగా చర్చించడానికి 3సార్లు ఎమ్మెల్యేగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించిన మీ పరిపాలన అనుభవం దోహదపడుతుంది. షెడ్యూల్ కులలా ఛైర్మన్ పదవి బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆ శాఖ పట్ల చొరవ చూపి ఎస్సీల అభ్యున్నతి కోసం శ్రమించారు. హ్యాండ్లూమ్ మంత్రిగా చేనేత రుణాలు మాఫీ చేయించి పేదల సమస్యల పరిష్కరించిన తీరు మంచితనానికి నిదర్శనం