Telangana Congress CM Revanth Reddy: హైదరాబాద్‌: సీఎల్పీ నేత రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ పార్టీ అగ్రనేతలతో బుధవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ మంత్రులపై రేవంత్ తో చర్చించింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రేవంత్ వెంట షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, తదితరులు ఉన్నారు. c




బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్‌ శాండిల్య రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రత్యేక కాన్వాయ్ లో రేవంత్ రెడ్డి గచ్చిబౌలికి బయలుదేరారు. నేటి రాత్రి హోటల్ ఎల్లాలో బస చేసి గురువారం ఉదయం ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియానికి రానున్నారని పార్టీ శ్రేణులు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.