NEET Controversy: నీట్ని రద్దు చేయాల్సిందే, తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
NEET Controversy 2024: నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే నీట్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది.
Tamil Nadu Resolution Against NEET: నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. NEET ఎగ్జామ్ని బ్యాన్ చేయాలని ఏకగ్రీవ తీర్మానం పాస్ చేసింది. అసెంబ్లీలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. NEETని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. NEET ఎగ్జామ్ రాక ముంది 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చే వాళ్లు. ఆ పాత పద్ధతినే కొనసాగించాల్సిన అవసరముందని స్టాలిన్ వెల్లడించారు. ప్రస్తుతానికి MBBS,BDS అడ్మిషన్లు కావాలంటే నీట్ ఎగ్జామ్ రాయడం తప్పనిసరి. కానీ తమిళనాడు మాత్రం ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. అంతకు ముందు పుదుచ్చేరిలోనూ NEETని రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేసింది DMK.ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రపతి పరిధిలో ఉంది. తమిళనాడు ప్రభుత్వం మాత్రం తక్షణమే నీట్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. అధికార డీఎమ్కేతో పాటు పలు స్థానిక పార్టీలూ ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. ఇప్పటికే చాలా సార్లు DMK మంత్రులు నీట్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ కనిమొళి అయితే..నీట్ ఎగ్జామ్ నుంచి తమిళనాడును మినహాయించాలన్న వాదనా వినిపించారు.
"నీట్ ఎగ్జామ్ మాకు అవసరం లేదని మేం చాలా రోజులుగా వాదిస్తూనే ఉన్నాం. ఇప్పుడు లీక్ వ్యవహారంతో ఆ ఎగ్జామ్లోని అవకతవకలు బయటపడ్డాయి. విద్యార్థులు ఈ పరీక్ష కారణంగా చాలా నష్టపోతున్నారు. అందుకే మేం దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో తీర్మానించాం. దానిపై రాష్ట్రపతి సంతకం చేయాల్సి ఉంది"
- కనిమొళి, డీఎమ్కే ఎంపీ
రాష్ట్రపతి ఈ తీర్మానంపై సంతకం పెట్టకుండా జాప్యం చేస్తే చాలా మంది విద్యార్థుల భవితవ్యం నాశనమైపోతుందని అన్నారు కనిమొళి. మే 5వ తేదీన NEET-UG 2024 Examination జరిగింది. దేశవ్యాప్తంగా 571 సిటీల్లో 4,750 సెంటర్స్లో ఈ పరీక్ష నిర్వహించారు. 23 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశాను. అయితే...ఫలితాలే అందరినీ షాక్కి గురి చేశాయి. 67 మందికి 720 కి 720 మార్కులు వచ్చాయి. దీనిపైనే విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తరవాత పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విచారణ జరిపేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. అయితే...నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మార్పులు చేయాల్సిన అవసరముందన్న డిమాండ్ వినిపిస్తోంది. అటు పార్లమెంట్లోనూ ఈ వ్యవహారంపై చర్చ జరిగింది. తక్షణమే చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్లో నీట్పై చర్చ జరగాల్సిన అవసరముందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మరి కొందరు విపక్షాల ఎంపీలూ ఇదే డిమాండ్ చేశారు. ఫలితంగా లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ కార్యకలాపాలు సజావుగా సాగలేదు.