J&K:


స్పెషల్ ఆపరేషన్‌..


ఈ మధ్య కాలంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయి. భారత సైన్యం నిలువరిస్తున్నప్పటికీ...ఏదో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. లేదంటే..దాడికి యత్నాలైనా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఓ అనుమానాస్పద డ్రోన్‌ను స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) గుర్తించింది. జమ్ముకశ్మీర్‌లోని సంబా జిల్లాలో కొందరు స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం SOG డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఉండి ఉంటుందన్న గ్రామస్థుల అనుమానాల ఆధారంగా అక్కడ జల్లెడ పట్టినట్టు డిప్యుటీ ఎస్‌పీ వెల్లడించారు. "పాకిస్థాన్‌ మరోసారి కుట్రకు పాల్పడేందుకు ప్రయత్నించింది. సంబా జిల్లాలో డ్రోన్‌ను పంపింది. గ్రామస్థులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడికి వచ్చి డ్రోన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది" అని డీఎస్‌పీ ఘారురామ్ స్పష్టం చేశారు. "రక్షణ శాఖ అందించిన వివరాల ప్రకారం...పాక్‌కు చెందిన డ్రోన్ శనివారం భారత  భూభాగంలోకి వచ్చింది. ఇది స్థానికుల్లో ఆందోళన కలిగించింది" అని చెప్పారు. సంబా సెక్టార్‌లోని సారథి కలాన్ ప్రాంతం వద్ద డ్రోన్‌ను గుర్తించారు. చక్ దుల్మా నుంచి పాకిస్థాన్‌ హైదర్ పోస్ట్‌కు చేరుకుంది. మధ్యలో డెరా, మడూన్‌ గ్రామాల మీదుగా వెళ్లింది. వైట్ లైట్‌ను వెదజల్లుతూ డ్రోన్‌ సంచరించినట్టు అధికారులుతెలిపారు. 


గతంలోనూ ఇలాంటి ఘటనలు..


కిలోమీటర్ ఎత్తులో డ్రోన్ ఎగిరిందని, భద్రతా దళాలు గుర్తించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్నారని డీఎస్‌పీ చెప్పారు. ఇప్పుడే కాదు. గతంలోనూ పాకిస్థాన్ ఇలాంటి దాడులకు యత్నించింది. భారత భూభాగంపై నిఘా పెట్టేందుకు ఇలా డ్రోన్‌లను వినియో గించింది. డ్రగ్స్‌ను పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ భద్రతా దళాలు వీరిని ముందుగానే గుర్తించి నిలువరించారు. ఇప్పుడు డ్రోన్‌ కలకలంతో దళాలు ఇంకా అప్రమత్తమయ్యాయి. బంద్రాలి, జక్ సహా సంబా జిల్లాకు సమీపంగా ఉన్న అన్ని ప్రాంతాలపైనా నిఘా పెంచారు. సున్నితమైన ప్రాంతాల్లో అణువణువూ గాలిస్తున్నారు. గతంలో పంజాబ్- పాకిస్థాన్ సరిహద్దులో ఓ డ్రోన్‌ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి పంజ్‌గ్రైన్ ప్రాంతంలో డ్రోన్ శబ్దం రావడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఆ సమయంలో ఓడ డ్రోన్ పాకిస్థాన్ నుంచి భారత్ ప్రాంతంలోకి రావడాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో ఆ డ్రోన్‌పై కాల్పులు జరిపి అనంతరం గాలింపు చేపట్టారు. అమృత్‌సర్‌ జిల్లాలోని గుర్‌దాస్‌పుర్ సెక్టార్కు 2700 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఘగ్గర్, సింఘోక్ గ్రామాల్లో జాగిలాలతో బలగాలు అన్వేషించాయి.అంజాలా సెక్టార్‌లోని పజ్‌గరైన్ పోస్ట్ సమీపంలో ఈ డ్రోన్‌పై సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) కాల్పులు జరిపింది. ఆ డ్రోన్ నుంచి పసుపు రంగులో ఉన్న రెండు ప్యాకెట్లు జారవిడిచినట్లు అధికారులు గుర్తించారు. పంజాబ్‌ సరిహద్దులో ఇలాంటి డ్రోన్ ఘటన తొలిసారి కాదు. జనవరిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది.


Also Read: Robotic Knee Replacement: ప్రపంచంలోనే మొట్టమొదటి మోకాలి మార్పిడి చేసే రోబో ఆవిష్కరణ