Gujarat Building Collapse: గుజరాత్‌లోని సూరత్‌లో బిల్డింగ్ కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య 7కి పెరిగింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏడుగురి మృతదేహాల్ని అధికారులు వెలికి తీశారు. జులై 6న మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. మరో ఏడుగురు శిథిలాల కిందే చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. అప్పటికే కూలిపోయే దశలో ఉన్న భవనం...వర్షాల కారణంగా మరింత కుంగిపోయిందని వెల్లడించారు. ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 30 ఫ్లాట్‌లున్నాయి. వీటిలో చాలా వరకూ ఖాళీగానే ఉన్నాయి. పైగా ఈ బిల్డింగ్‌ని అక్రమంగా నిర్మించారని తేలింది. 2017లో ఈ అపార్ట్‌మెంట్‌ని కట్టారు. స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్లకు చికిత్స అందిస్తున్నారు.





అయితే..ఈ బిల్డింగ్‌ కూలిన సమయంలో చాలా వరకూ బయట పనులకు వెళ్లారు. ఫలితంగా ప్రాణనష్టం తప్పింది. లేదంటే ఎక్కువ మంది చనిపోయి ఉండే వారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నైట్‌షిఫ్ట్‌ చేసి వచ్చి కొందరు నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బిల్డింగ్ కూలిన వెంటనే స్థానికులు ఉలిక్కిపడ్డారు. అధికారులకు సమాచారం అందించారు. లోపల నిద్రిస్తున్న వాళ్ల శిథిలాల కింద చిక్కుకుపోయారు. 8 ఏళ్ల క్రితం కట్టిన బిల్డింగ్‌ ఇప్పటికే కూలిపోయే దశకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణం కావడం వల్ల దీనిపై మరింత దృష్టి సారించారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 


"మొత్తం 30 ఫ్లాట్‌లున్న ఈ అపార్ట్‌మెంట్‌లో కేవలం 5 ఫ్లాట్స్ తప్ప మిగతావన్నీ ఖాళీగానే ఉన్నాయి. దగ్గర్లోని ఫ్యాక్టరీల్లో వీళ్లంతా పని చేసుకుంటారు. రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టగానే శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లు గట్టిగా కేకలు పెట్టారు. వాళ్ల ఏడుపులూ వినిపించాయి. అప్పటికప్పుడు ఓ మహిళను రక్షించాం. మరికొందరు శిథిలాల కిందే ఉన్నారు. వాళ్లను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం"


- అధికారులు


 






Also Read: HIV Cases: విద్యార్థుల్లో పెరుగుతున్న HIV కేసులు, ఇప్పటికే 47 మంది మృతి - వందలాది మందికి పాజిటివ్