స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు పిటిషన్‌పై దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ కాలంగా రిజర్వ్ లో ఉన్న తీర్పును ఇవాళ ఇచ్చారు.   


ఇవాళ సమావేశమైన బెంచ్‌లో చంద్రబాబుకు అనుకూలంగా జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు వెల్లడించారు. ఆయన పిటిషన్ సరైనదేనంటూ సమర్థించారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా నిర్ణయాన్ని వెల్లడించారు. అనంతరం తన తీర్పు తెలియజేసిన త్రివేది... ఈ కేసులో 17ఏ వర్తించదని అభిప్రాయపడ్డారు. దీంతో చీఫ్‌ జస్టిస్‌కు రిఫర్ చేశారు.   


స్కిల్ కేసులో తనకు 17ఏ వర్తిస్తుందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ అర్థరాత్రి అరెస్టు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు నమోదు చేశారు.  తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తర్వాత హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కనీస సాక్ష్యాధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపైనా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 


క్వాష్ పిటిషన్ పై తీర్పు అక్టోబర్ 18వ  తేదీన రిజర్వ్                               
స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఇబ్బడిమబ్బడి కేసుల గురించి అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో అదే పనిగా విచారణకు వస్తున్నాయి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరికి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా ఈ కారణంగానే వాయిదా పడింది.