TASMAC Case ED: తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)పై సుప్రీం కోర్టు  ఆగ్రహం వ్య్కతంచేసింది. ఈ కేసు విషయంలో ఈడీ అన్ని హద్దులు దాటిందని  సుప్రీం కోర్టు, ప్రధాన న్యాయమూర్తి B.R. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. TASMAC కార్యాలయాలపై 2025 మార్చి,  మేలో జరిగిన దాడులను సమాఖ్య స్ఫూర్తి ఉల్లంఘనగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

టాస్మాక్ అనేది ప్రభుత్వ కార్పొరేషన్ అని.. ఒక కార్పొరేషన్‌పై క్రిమినల్ కేసు ఎలా నమోదు చేయవచ్చుని అని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ED ప్రతినిధి అడిషనల్ సొలిసిటర్ జనరల్ S.V. రాజును ప్రశ్నించారు. TASMAC వంటి రాష్ట్ర యాజమాన్య సంస్థపై ED చర్యలు అసమంజసమని  స్పష్టం చేసింది.  ED దాడులకు ఆధారమైన "ప్రిడికేట్ ఆఫెన్స్"   ఏమిటని కోర్టు అడిగింది. రాష్ట్రం ఇప్పటికే 40కి పైగా FIRలను నమోదు చేసినప్పుడు ED ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సుప్రీంకోర్టు   ప్రశ్నించింది.  TASMAC కేసులో ED దర్యాప్తును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.   రెండు వారాల్లో తమ స్పందనను సమర్పించాలని ఈడీని  ఆదేశించింది.  

మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 23, 2025న ED దర్యాప్తును అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.   ED చర్యలు రాష్ట్ర సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తున్నాయని కోర్టు పేర్కొంది, ఎందుకంటే రాష్ట్ర సంస్థపై దాడులు రాష్ట్ర అధికారాలపై జోక్యాన్ని సూచిస్తాయని తెలిపింది.  

TASMAC కేసు ఏమిటంటే ?

TASMACలో రూ. 1,000 కోట్లకు పైగా ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.  ఇందులో లిక్కర్ రవాణా, బార్ లైసెన్స్‌లు, ,బాటిల్ తయారీ సంస్థలతో కుమ్మక్కై నిధులను దారి మళ్లించడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ఆరోపణల ఆధారంగా ED మార్చి 6-8 , మే 16, 2025న TASMAC కార్యాలయాలు,  సంబంధిత ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది.  తమిళనాడు ప్రభుత్వం ఈ దాడులను "రాజకీయ దురుద్దేశం"తో కూడినవిగా ఆరోపించింది, ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు BJP కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి DMKని లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది.ఇప్పుడు సుప్రీంకోర్టు దర్యాప్తు నిలిపివేయడంతో డీఎంకే సంతృప్తి వ్యక్తం చేసింది.