Tirumala Srivari darshan :   వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంది. తిరుపతి - మచిలీపట్నం - తిరుపతి మార్గంలో మొత్తం 14 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుండి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుండి మచిలీపట్నం వైపు (ట్రెయిన్ నెం. 07121) మరియు ఏప్రిల్ 14 నుండి మే 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుండి తిరుపతి (ట్రెయిన్ నెం. 07122) వైపు నడుస్తాయి.

తిరుపతి - మచిలీపట్నం రూటులో ప్రత్యేక రైళ్ల వివరాలు 

 తిరుపతి - మచిలీపట్నం (07121): ఆదివారం రాత్రి 10:20కు తిరుపతి నుంచి బయలుదేరి, సోమవారం ఉదయం 7:30కి మచిలీపట్నానికి చేరుకుంటుంది.

మచిలీపట్నం - తిరుపతి (07122): సోమవారం సాయంత్రం 5:40కి మచిలీపట్నం నుంచి బయలుదేరి, మంగళవారం తెల్లవారుజామున 3:20కి తిరుపతికి చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన స్టేషన్లలో ఆగుతాయి. రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్‌లు, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. 

చర్లపల్లి - శ్రీకాకుళం రూట్‌లోనూ ప్రత్యేక రైళ్లు  

 చర్లపల్లి - శ్రీకాకుళం రూట్‌లో కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 24 సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.

చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ (07025): ఏప్రిల్ 11 నుండి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9:15కి చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:15కి శ్రీకాకుళం రోడ్డుకు చేరుతుంది.

శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి (07026): ఏప్రిల్ 12 నుండి జూన్ 28 వరకు ప్రతి శనివారం బయలుదేరి, అదే రోజు ఉదయం 6:00కి చర్లపల్లికి చేరుతుంది.

 ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.    

వేసవిలో సహజంగానే అధిక రద్దీ ఉంటుంది. పిల్లలకు సెలవుల కారణంగా మొక్కులు తీర్చుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆలయాల్లో భక్తుల రద్దీ పెరుగుతుంది.అందుకే ప్రతి వేసవిలోనూ రైల్వే శాఖ బాగా రద్దీ ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంది. ఈసారి ప్రత్యేక రైళ్లను కొత్తగా సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలతో ఉండే కొత్త రైళ్లను నడపనున్నట్లుగా తెలుస్తోంది.