Security Breach In Lok Sabha: లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటన ( Security Breach)పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం శీతకాల సమావేశాలు కొనసాగుతుండటంతో పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు (Delhi Police Teams) ఆరు రాష్ట్రాల (Six States )కు వెళ్లాయి. నిందితులను కూడా వెంట తీసుకెళ్లాయి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో కేసు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలు, పూర్వాపరాలను మరో 50 బృందాలు సేకరిస్తున్నాయి. పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్‌ ఝా ధ్వంసం చేసిన ఆధారాలను పోలీసులు కనుగొన్నారు. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో ఫోన్లను అతడు దహనం చేసినట్లు గుర్తించారు. కాలిపోయిన ఫోన్లను ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. 


పార్లమెంటు (Parliament)లో దాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. నిందితులపై ఉపా (UAPA)  చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ ( Mastermind )లలిత్‌ ఝా (Lalit jha)...కర్తవ్యపథ్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. రాజస్థాన్‌ పారిపోయిన లలిత్‌ ఝా...ఢిల్లీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సరెండర్‌ అయ్యాడు. దీంతో అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు...దాడి ఘటనపై విచారిస్తున్నారు. మరోవైపు లోక్‌సభలోకి వెళ్లి స్మోక్ అటాక్‌ చేసిన సాగర్ శర్మ, మనోరంజన్‌...పార్లమెంట్‌ బయట రచ్చ చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలను కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. 


నిందితులపై చట్టవ్యతిరేక  కార్యకలాపాల నిరోధకచట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనతో ఏ టెర్రర్‌ గ్రూపులకు సంబంధం లేదని తేలింది. కోల్‌కత్తాకు చెందిన లలిత్‌ ఝా...ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్‌ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సంచలనం రేపాలని అనుకున్నాడు. గురుగ్రామ్‌లోని విక్కీ శర్మ ఇంటికి సాగర్‌ శర్మ, మనోరంజన్, నీలమ్ అజాద్‌, ఆమోల్ షిండేలను పిలిపించాడు. ఆరుగురు లోపలికి వెళ్లి స్ప్రే చేయాలని భావించారు. ఇద్దరికే ఎంట్రీ దొరకడంతో విజిటర్స్ పాసులతో సాగర్ శర్మ, మనోరంజన్...లోక్‌సభలోకి వెళ్లారు. 


పార్లమెంట్‌ బయట నీలమ్, ఆమోల్ షిండేలు పొగ స్ప్రే చేశారు. లలిత్ ఝా వీడియో రికార్డు చేశాడు. అక్కడి నుంచి రాజస్థాన్‌ పారిపోవడానికి ముందే...సోషల్ మీడియాలో  వీడియో పోస్ట్‌ చేశాడు. మీడియాలో కవరయ్యేలా చూడాలని ఓ ఎన్జీవోకు వీడియో క్లిప్‌ పంపాడు. దాడికి ముందే నలుగురి ఫోన్లను లలిత్ తీసుకున్నాడు.  నిరుద్యోగం, మణిపూర్‌లో హింసకు వ్యతిరేకంగానే దాడి చేసినట్లు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్‌.. పార్లమెంటులోకి ప్రవేశించేందుకు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా నుంచి విజిటింగ్ పాస్‌‌లు తీసుకున్నాడు. తనతోపాటు తన స్నేహితుడు అని చెప్పి సాగర్‌ శర్మకు కూడా మరో పాస్ ఇప్పించాడు. మనోరంజన్ పిలుపు మేరకు మిగతా వారు కూడా ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలోనే మనోరంజన్‌ పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది.