Smriti Irani Defamation Suit: 


ట్వీట్‌లు, రీట్వీట్‌లు డిలీట్ చేయండి 


కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే స్మృతి ఇరానీ స్పందించారు. నిరాధారమైన ఆరోపణలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు చేసిన వారందరికీ లీగల్ నోటీసులు కూడా పంపారు. కాంగ్రెస్ నేతలైనా జైరామ్ రమేశ్, పవన్ ఖేరా, నెట్టా డిసౌజా పై పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే దిల్లి హైకోర్టు ఆయా నేతలకు సమన్లు జారీ చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను వెంటనే తొలగించాలని
ఆదేశించింది. కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా తమ పరువుకు భంగం కలిగించారని, ఇదో కుట్ర అని కేంద్ర మంత్రి తన పరువు నష్టం దావాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల పబ్లిక్‌ లైఫ్‌లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందులో ప్రస్తావించారు. క్యారెక్టర్‌ను డిఫేమ్ చేసే చర్యగా అభివర్ణించారు. ఈ తీర్పునిచ్చే క్రమంలో జస్టిస్ మిని పుష్కరణ కీలక వ్యాఖ్యలు చేశారు. "గోవాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురు ఇల్లీగల్‌గా బార్ నడుపుతున్నారన్న ఆరోపణలకు సంబంధించిన పోస్ట్‌లను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌ నుంచి తొలగించాలి. మార్ఫ్‌డ్ పిక్చర్లు, వీడియోలు, రీట్వీట్లు, ఆమె కూతురు ఫోటోలు కూడా వెంటనే డిలీట్ చేయాలి" అని ఆదేశించారు. "వాస్తవాలు, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేసినందుకు గానూ ప్రెస్‌మీట్ సహా, సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన కామెంట్లు ఏవి ఉన్నా తొలగించాలి" అని చెప్పారు. 


కాంగ్రెస్‌కు నోటీసులు పంపిన స్మృతి ఇరానీ 


కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపారు. తన కూతురు గోవాలో ఇల్లీగల్‌గా బార్ నడుపుతున్నారన్న ఆరోపణలను ఖండిస్తూ...ఈ నోటీసులు పంపించారు. కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, నెట్టా డిసౌజాకు ఈ నోటీసులు అందాయి. నేషనల్ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌పై విమర్శలు చేసినందుకే, ఈ కొత్త వివాదం తెరపైకి తీసుకొచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇదో "ద్వేషపూరిత" చర్య అని మండిపడ్డారు. స్మృతి ఇరానీ తరపు న్యాయవాది ఆయా కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపినట్టు వెల్లడించారు. " మా క్లైంట్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. అరకొర సమాచారంతో చేసిన నిరాధార ఆరోపణలవి. ఎలాంటి వెరిఫికేషన్‌ లేకుండానే పబ్లిక్‌గా ఆ తప్పుడు వివరాలను బయట పెట్టారు. ఇది కచ్చితంగా కుట్రే. కేవలం ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేసిన చర్యే" అని ఆ నోటీసులో పేర్కొన్నారు న్యాయవాది. "ఓ కేంద్ర మంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేసి తన పబ్లిక్‌ లైఫ్‌కు భంగం కలిగించారు. ఆమె నిజాయతీని కించపరచటమే కాకుండా ఆమె కూతురుని కూడా అవమానించారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఇది తీవ్రమైన నేరం. వీటికి పరిహారం చెల్లించాల్సిందే" అని అందులో స్పష్టం చేశారు. లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


Also Read: Ramarao On Duty Review - రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?


Also Read: Vijay Devarakonda: రష్మికతో తనకున్న బంధం ఏంటో చెప్పేసిన విజయ్ దేవరకొండ!