పార్టీని ముక్కలు చేసేందుకు చూస్తున్నారు: ఉద్దవ్ థాక్రే 


మహారాష్ట్రలో ప్రస్తుతానికి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. రెబల్ లీడర్‌ ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనకు కష్టకాలం మొదలైంది. షిండే శిబిరానికి వలస వెళ్లిన వారిని ఉద్దేశిస్తూ ఉద్దవ్ థాక్రే చురకలు అంటించారు. ఏక్‌నాథ్ షిండేకు మద్దతు ఇచ్చే వారంతాశివసేన పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. వెళ్లిపోయిన వాళ్ల గురించి తానెందుకు బాధపడాలంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో వర్చువల్‌గా సమావేశమైన థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేనను వీడాల్సిన పరిస్థితి వస్తే చనిపోవటానికైనా సిద్ధమేనని, ఎంత కష్టకాలం వచ్చినా పార్టీని వీడమని ఒకప్పుడు ప్రగల్బాలు పలికిన వారంతా ఇప్పుడు షిండే వద్దకు పారిపోయారంటూ ఆగ్రహించారు. 


రంగంలోకి దిగిన ఆదిత్య థాక్రే 


శివసేనను, థాక్రే కుటుంబాన్ని కాదని ఎంత దూరం వెళతారో చూస్తానని అన్నారు. చెట్ల నుంచి పూలు, పండ్లు తీసుకోవచ్చని, కానీ వేర్లనుధ్వంసం చేయటం ఎవరి తరమూ కాదని స్పష్టం చేశారు. ఉద్దవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే, రాష్ట్రంలోని ప్రస్తుతపరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉన్నట్టుండి అంత మంది ఎమ్మెల్యేలు షిండే వైపు వెళ్లటానికి కారణాలేంటో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఆదిత్య థాక్రే. కొందరు ఎమ్మెల్యేలు, రెబల్ నేతలపై విరుచుపడ్డారని, కొందరైతే భావోద్వేగానికిలోనై ఏడ్చారని తెలుస్తోంది. 


గువాహటిలోని ఓ హోటల్‌లో షిండేకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలందరూ ఉన్నారు. ఈ వారాంతానికి ఆ శిబిరంలోని ఎమ్మెల్యేల సంఖ్య 50 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిత్య థాక్రే రంగంలోకి దిగటం వల్ల షిండే శిబిరం అప్రమత్తమైనట్టు సమాచారం. ఇప్పటికే ఆదిత్యథాక్రేపై కోపంగా ఉన్నారు షిండే. పార్టీలోని సీనియర్ నేతలంతా ఆదిత్యథాక్రేకే గౌరవం ఇస్తుండటాన్ని షిండే తట్టుకోలేకపోయారు. అయితే ఇదే విషయాన్ని ఉద్దవ్ థాక్రే ప్రస్తావించారు. "ఏక్‌నాథ్ షిండే తన కొడుకుని ఎంపీగా చేసినప్పుడు, నా కొడుకు రాజకీయంగా ఎదిగితే తప్పేముంది" అని అంటూ చురకలు అంటించారు. 


పవర్‌ గేమ్స్‌పై నాకు ఆసక్తి లేదు: ఉద్దవ్ థాక్రే 


"ప్రస్తుతానికి నా ఆరోగ్యం ఏమీ బాగాలేదు. శరీరమంతా నొప్పులుగా ఉంది. కళ్లు కూడా సరిగా తెరవలేకపోతున్నా. కానీ ఇదేమీ నేను లెక్క చేయటం లేదు. ఈ పవర్ గేమ్స్‌ నాకు నచ్చదు" అని స్పష్టం చేశారు ఉద్దవ్ థాక్రే. రాజకీయ అనిశ్చితి మొదలైనప్పటి నుంచి ఇలా రెండోసారిభావోద్వేగ ప్రసంగం చేశారు థాక్రే. రాజీనామా చేయాలని ఏ ఒక్క ఎమ్మెల్యే నేరుగా వచ్చి చెప్పినా వెంటనే పదవి నుంచి తప్పుకుంటాని వెల్లడించారు. అటు షిండే శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వల్ల థాక్రే ప్రభుత్వం పడిపోక తప్పదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.