Saudi Arabia end Kafala: సౌదీ అరేబియా ప్రభుత్వం తన 50 ఏళ్ల నాటి కఫాలా (స్పాన్సర్‌షిప్) వ్యవస్థను అధికారికంగా రద్దు చేసినట్లు ధృవీకరించింది. ఈ నిర్ణయం 1.3 కోట్ల వలస కార్మికులకు పెద్ద ఊరటనిచ్చింది, వీరిలో 26 లక్షల మంది భారతీయులు ఉన్నారు. విజన్ 2030లో భాగంగా ఈ సంస్కరణలు అమలవుతున్నాయి,  'ఆధునిక బానిసత్వం'గా  కఫాలా వ్యవస్థపై విమర్శలుఉన్నాయి.   కఫాలా వ్యవస్థ సౌదీ అరేబియాలో 1970ల నుంచి అమలులో ఉంది. ఇది వలస కార్మికులపై యజమానులకు (కఫీల్) అపారమైన అధికారాలు కల్పిస్తుంది. కార్మికులు ఉద్యోగం మారడానికి, దేశం వదిలి వెళ్లడానికి యజమాని అనుమతి తప్పనిసరి. పాస్‌పోర్టులు, వీసాలు యజమాని చేతుల్లోనే ఉండేవి. ఈ వ్యవస్థ వల్ల కార్మికులు యజమానుల బానిసల్లా మారేవారు.   

Continues below advertisement

 కఫాలాను అడ్డుపెట్టుకుని యజమానులు కార్మికులను చిత్రహింసలు పెట్టేవారు. భారతీయులు, పాకిస్థానీలు, బంగ్లాదేశీలు ఎక్కువగా బాధితులు.  కార్మికులు దుర్భర పరిస్థితుల్లో పని చేయాల్సి వచ్చేది, జీతాలు రాకుండా, పాస్‌పోర్టులు లేకుండా బానిసల్లా జీవించేవారు. కఫాలా వ్యవస్థపై కొన్నేళ్లుగా అంతర్జాతీయ సంస్థలు తీవ్ర విమర్శలు చేశాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీన్ని 'ఆధునిక బానిసత్వం'గా పేర్కొన్నాయి. అనేక దేశాలు సౌదీపై ఒత్తిడి తెచ్చాయి. ఈ వ్యవస్థ వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, ట్రాఫికింగ్ పెరిగాయని ఆరోపణలు.  

Continues below advertisement

భారత్ కూడా సౌదీపై కఫాలా రద్దుకు ఒత్తిడి తెచ్చింది. గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికుల హక్కుల కోసం భారత్ ప్రభుత్వం లేబర్ కోడ్‌ల మార్పులు కోరింది. దౌత్య మార్గాల్లో, అంతర్జాతీయ ఫోరమ్‌లలో ఈ అంశాన్ని లేవనెత్తింది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ   మేరకు నిర్ణయం తీసుకున్నారు.  జూన్ 2025 నుంచి అమలులోకి వచ్చిన ఈ సంస్కరణలతో కార్మికులు యజమాని అనుమతి లేకుండా ఉద్యోగాలు మారవచ్చు, దేశం వదిలి వెళ్లవచ్చు. లేబర్ కోర్టులకు వెళ్లి హక్కులు కోరవచ్చు. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. భారతీయులకు ఇది పెద్ద ఊరట, ఎందుకంటే సౌదీలో 26 లక్షల మంది భారతీయులు పని చేస్తున్నారు.