Russia Ukraine War: రష్యా ఆ పని చేస్తే కథ వేరుంటది: జో బైడెన్

ABP Desam   |  Murali Krishna   |  26 Oct 2022 11:04 AM (IST)

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తుందని వస్తున్న వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.

రష్యా ఆ పని చేస్తే కథ వేరుంటది: జో బైడెన్

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలను ఉపయోగించాలని రష్యా ప్రయత్నాలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రష్యా చేసే తీవ్రమైన తప్పుగా అమెరికా భావిస్తుందని బైడెన్ అన్నారు.

యూరోప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ వద్ద రష్యా తన అణు సామర్థ్యాలపై సాధారణ కసరత్తులను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. దీనిపై బైడెన్ ఘాటుగా స్పందించారు.

రష్యా వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగిస్తే అది చాలా తీవ్రమైన తప్పు అవుతుంది. రష్యా అణ్వాయుధాలను ఉపయోగిస్తుందా లేదా అనే దానిపై నేను ఏమీ చెప్పలేను. కానీ ఒక వేళ వినియోగిస్తే అది తీవ్రమైన పొరపాటు అవుతుంది.                    -    జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

తీవ్ర పరిణామాలు

వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ కూడా ఈ విషయంపై మాట్లాడారు.

అధ్యక్షుడు తాను చెప్పినదానిపై స్పష్టంగా ఉన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా అణ్వాయుధాలను ప్రయోగించడం పెద్ద తప్పు, ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఉక్రెయిన్ తన సొంత భూభాగంలో డర్టీ బాంబును ఉపయోగించేందుకు సిద్ధమవుతోందనేది రష్యా చేస్తోన్న తప్పుడు ఆరోపణ. కాబట్టి మేము దీనిని తీవ్రంగా పరిగణించాలి.                                      - కరీన్ జీన్-పియర్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ 

విద్యుత్ కేంద్రాలే

యుద్ధం మొదలై 8 నెలలు పూర్తయినా ఉక్రెయిన్‌ తలొగ్గక పోవడంతో రష్యా రూటు మార్చింది. ఆత్మాహుతి డ్రోన్‌లతో ఉక్రెయిన్‌ మౌలిక వసతులను ధ్వంసం చేస్తోంది. రష్యా దాడికి ఉక్రెయిన్‌లో మూడింట ఒక వంతు ప్రజలు గాఢాంధకారంతో కొట్టుమిట్టాడుతున్నారు.

ఉక్రెయిన్ విద్యుత్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేస్తోంది. కీవ్‌, జటోమీర్‌, దినిప్రో, జపోరిజియాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లను ధ్వంసం చేస్తోంది. జటోమీర్‌లో 2 లక్షల యాభై వేల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కీవ్‌లోనూ 50వేల మంది అంధకారంలో నలిగిపోతున్నారు.

విద్యుత్‌ సరఫరా లేని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. కనీస వసతులకు నీరు లేక ఉక్రెయిన్‌ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్‌ సరఫరా లేక పిల్లలు వృద్ధులకు అత్యవసర వైద్యసేవలు నిలిచిపోయాయి. 

Also Read: UK New Cabinet :యూకే హోంసెక్రటరీగా భారత సంతతి మహిళ, రిషి సునక్ టీమ్ ఇదే!

Published at: 26 Oct 2022 10:56 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.