Raptadu MLA: రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రజల తరఫున, వైసీపీ పార్టీ శ్రేణుల తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఎస్పీని ర్యాలీగా వెళ్లి కలిశారు. ఆ తర్వాతే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుకు సారీ చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


తన ఫ్యామిలీపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. ఐ టీడీపీ ఆదేశాలతో జిల్లా నేతలు కొందరు ఈ పని చేస్తున్నారని మండిపడ్డారు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగానే టీడీపీ అధినేతకు క్షమాపణలు చెప్పారు. 


అసలేం జరిగిందంటే..?


ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు ఇటీవల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.  హత్యారాజకీయాలంటూ మొదలుపెడితే టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ నుంచే మొదలు పెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. తన సోదరుడి వ్యాఖ్యలపై రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి  విశాఖలో స్పందించారు. చంద్రబాబు ఫ్యాక్షన్ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు మాట్లాడాడు అన్నారు. తన తమ్ముడు మాట్లాడిన భాష తప్పు అని, భావం సరైనదే అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు. వైసీపీలో కొంత మంది ఎమ్మెల్యేల వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గెలవలేక బట్టకాల్చి మీద వేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టే చర్యలు కనిపిస్తున్నాయన్నారు.


చంద్రబాబు, లోకేష్ కు క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనలు..


పరిటాల శ్రీరామ్ బెదిరింపులు వెనక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాప్తాడు ఎమ్మెల్యేకి టైం దగ్గర పడిందని మాట్లాడుతున్నారు అంటే చంపుతారని బెదిరిస్తారా? తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టడం కాదా? అని ప్రశ్నించారు. అయితే ఇదే సమయంలో ప్రెస్ క్లబ్ వద్దకు టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత నాయకులు చేరుకుని ఆందోళన చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు ప్రకాష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ కు భద్రత పెంచాలని కోరారు.  నిరసన చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, తెలుగు యువత పెంటిరాజ్, వలిశెట్టి తాతాజీలు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 


పరిటాల సునీత, శ్రీరామ్ ల ఆందోళన...


చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ నేత గంటాపురం జగ్గు ఖండించారు. ఆ ఆర్ధరాత్రికే ఆయన అరెస్టు, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేశాయి. సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత గంటాపురం జగ్గును శనివారం (నవంబరు 26) అర్ధరాత్రి అరెస్టు చేయడం, వైఎస్ఆర్ సీపీ నాయకులు దాడి చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలు భారీగా స్టేషన్ ఎదుట బైఠాయించి జగ్గును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ పరిణామాలకు తోపుదుర్తి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి బ్రదర్స్ కారణమని విమర్శించారు. వారు మాట్లాడిన మాటలు దిగజారుడుగా ఉన్నాయని పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పడంతో ఈ గొడవ ఇక్కడితో సద్దుమనుగుతుందో లేదో చూడాలి మరి.