సీఎం జగన్ గుంటూరు పర్యటన


ఏపీ సీఎం జగన్ ఈ రోజు గుంటూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు ఆయన హాజరవుతారు.


వివేకా హత్య కేసు దర్యాప్తు ట్రాన్స్ ఫర్ పై నేడు తీర్పు


సీసీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ట్రాన్స్‌ఫర్‌పై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ ఆయన కుమార్తె సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.


చంద్రబాబు షెడ్యూల్‌


హైదరాబాద్‌లోనే చంద్రబాబు, లోకేష్ నేడు ఉండనున్నారు. రేపటి నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు నిర్వహించే పర్యటనపై పార్టీ నేతలతో మాట్లాడనున్నారు చంద్రబాబు.


రాజమండ్రికి  బీజేపీ నేతలు


రాజమండ్రిలో ఈ రోజు బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శుల మీటింగ్ జరగనుంది. ఎల్లుండి పార్టీకి చెందిన జిల్లా స్థాయి అధ్యక్షులతో మరో సమావేశం జరగబోతుంది. దానితోపాటే బీజేపీ సోషల్ మీడియాకు దిశానిర్దేశం చెయ్యనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కీలక నేతలు అంతా రాజమండ్రిలోనే ఉంటారు. కేంద్రమంత్రి మురళీధర పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురంలో ఈరోజు పర్యటించనున్నారు. ఆయనతోపాటు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పర్యటన లో పాల్గొననున్నారు.


నేడు మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‌పై విచారణ


ఇవాళ మాజీ మంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. గత ఏప్రిల్‌లో జరిగిన టెన్త్ ఎక్సామ్ పేపర్ లీకేజీ కేసులో చిత్తూరు కోర్టు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 


జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు


తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు నేడు జరగనున్నాయి. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, హోంశాఖ మంత్రి తానేటి వనిత తదితరులు హాజరుకానున్నారు.