Rajkot News:


రాజ్‌కోట్‌లో ఘటన..


గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. స్కూల్‌ బస్‌ నడుపుతున్న డ్రైవర్‌కు ఉన్నట్టుండి గుండె పోటు వచ్చింది. స్టీరింగ్‌పై పట్టు కోల్పోవడాన్ని గమనించిన ఓ విద్యార్థిని వెంటనే గమనించి ధైర్యంగా ముందుకొచ్చింది. స్టీరింగ్‌ను పట్టుకుని బస్‌ అదుపు తప్పకుండా కంట్రోల్ చేసింది. పాదచారులపైకి బస్ వెళ్లకుండా స్టీరింగ్‌ను తిప్పి కరెంట్‌ పోల్‌కు ఢీకొట్టింది. ఆ బాలిక సమయస్ఫూర్తితో  తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం కాస్త ధ్వంసమైంది. ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాల ప్రకారం...డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. స్టీరింగ్‌పై కంట్రోల్ కోల్పోవడం వల్ల బస్ రాంగ్‌ రూట్‌లో దూసుకుపోయింది. బస్‌లో ఉన్న 17 ఏళ్ల భార్గవి వ్యాస్‌ డ్రైవర్ సీట్‌ వైపు పరిగెత్తుకొచ్చింది. డ్రైవింగ్‌ తెలియకపోయినా స్టీరింగ్‌ను పట్టుకుని కంట్రోల్ చేసింది. నేరుగా కరెంట్‌ పోల్‌ను ఢీకొట్టింది. గుండెపోటుకు గురైన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


"మా స్కూల్‌లో ఇవాళ ఓ ప్రోగ్రామ్ ఉంది. అందరం ముందుగా వెళ్లాల్సి ఉంది. కానీ బస్ లేట్‌గా వచ్చింది. ఎక్కిన వెంటనే నేను డ్రైవర్‌ను ఎందుకు లేట్ అయిందని అడిగాను. ఆయన ఏ సమాధానమూ ఇవ్వలేదు. బస్‌ నడుపుతుండగానే చేతులు వేలాడేసి పక్కకు పడిపోయాడు. నేను వెంటనే స్టీరింగ్‌ చేతుల్లోకి తీసుకున్నాను. నాకు తోచినంత వరకూ కంట్రోల్ చేశాను. ఆ సమయంలో రోడ్‌పై చాలా మంది ఉన్నారు. కాస్త అటు ఇటు అయినా వారిపైకి బస్ దూసుకుపోయేదే. స్టీరింగ్‌ను పూర్తిగా బెండ్ చేయడం వల్ల పక్కనే ఉన్న కరెంట్‌ పోల్‌కు ఢీకొట్టింది" 


- భార్గవి వ్యాస్