తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది.  దీని ప్రభావం వల్ల మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరం వెంబడి పయణించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావం వల్ల పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తీరం వెంబడి గంటకు 55-65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. అల్పపీడనం నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్ జారీ చేశారు. ఈ మూడు రోజులు (మంగళవారం వరకు) వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. 


ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో వర్షాలు.. 
ఇవాళ, రేపు ఉత్తర కోస్తా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


తెలంగాణలో మరో 4 రోజులు వానలే వానలు.. 
రాబోయే 4 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య బంగాళా ఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం, ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో బుధ వారం నాడు (ఈ నెల 15న) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 


Also Read: Horoscope Today :ఈ రాశులు వారు ఈ రోజు పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు..ఆ రాశి వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి


Also Read: Bigg Boss 5 Telugu : ఈ వారం వారిద్దరూ సేఫ్.. కాజల్ నటిస్తూనే ఉందన్న ఉమా దేవి.. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పిన షణ్ముఖ్..