Rahul Gandhi Disqualification:



నిరసనలు..


రాహుల్‌ గాంధీపై అనర్హతా వేటు వేయడం దేశవ్యాప్తంగా రాజకీయాలను వేడెక్కించాయి. కాంగ్రెస్‌ వ్యతిరేక పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాయి. బీజేపీ నియంతృత్వ నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులూ పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపడుతున్నాయి. కేరళలోని వాయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీకి అక్కడ మంచి ఫాలోయింగే ఉంది. రాహుల్‌ ఎంపీగా కొనసాగేందుకు వీల్లేదని లోక్‌సభ సెక్రటరీ జనరల్ తీసుకున్న నిర్ణయంపై వాయనాడ్ కాంగ్రెస్ కమిటీ ఆందోళనలు చేపడుతోంది. ఈ రోజు (మార్చి 25) బ్లాక్‌డేగా ప్రకటించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్‌డీ అప్పచన్ ఈ విషయం అధికారికంగా వెల్లడించారు. 


"రాహుల్‌ గాంధీపై అనర్హతా వేటు వేయడాన్ని నిరసిస్తున్నాం. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ రోజుని బ్లాక్‌డేగా ప్రకటించింది"


- ఎన్‌డీ అప్పచన్, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు 






ఇప్పటికే కాంగ్రెస్ న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయంతో తమను భయపెట్టలేరని స్పష్టం చేస్తోంది. అదానీ, మోదీ మైత్రి గురించి అడిగినందుకే బీజేపీ ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తుందని మండి పడుతోంది.


తనపై అనర్హతా వేటు వేసిన తరవాత తొలిసారి రాహుల్ గాంధీ స్పందించారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. తాను భారత దేశ ప్రజల గొంతుకను వినిపిస్తున్నానని, ఇందుకోసం ఎక్కడి వరకైనా వెళ్లేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. 


"నేను భారత దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను. వాళ్ల గొంతుకను వినిపించేందుకు పోరాడుతున్నాను. దేనికైనా సిద్ధంగానే ఉన్నాను" 
 
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత