I.N.D.I.A PM Race: 



ప్రధాని అభ్యర్థిపై వాగ్వాదం..? 


లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) కోసం ఇప్పటి నుంచి అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి I.N.D.I.A కూటమి ఏర్పాటు చేశాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఈ కూటమిలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అయితే...ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ని కాస్త డీలా పడేలా చేశాయి. లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది ఆ పార్టీ. ఇప్పటికే విపక్ష కూటమిలోనే కీలక నేతలతో సమావేశమైంది. ఈ సమయంలోనే ప్రధాని అభ్యర్థి ఎవరన్న చర్చ వచ్చింది. కొంత మంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రస్తావించారు. దీనిపైనే నితీశ్ కాస్త అలక వహించినట్టు సమాచారం. లోపల ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నది స్పష్టత లేకపోయినా ప్రధాని అభ్యర్థి విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపైనే రాహుల్ గాంధీ నితీశ్ కుమార్‌కి కాల్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కూటమిలోని కొందరు నేతలకు, నితీశ్ కుమార్‌ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిపాయి. కూటమి పేరుని I.N.D.I.A అని కాకుండా Bharat గా మార్చాలని కొందరు ప్రతిపాదించారు. దీనిపై నితీశ్ కుమార్ కాస్త గట్టిగానే వాదించారట. అంతకు ముందు DMK నేత తమిళ్‌లో మాట్లాడుతూ హిందీలోకి అనువదించాలని కోరారు. దీనిపైనా నితీశ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హిందీ నేర్చుకోండి అంటూ మందలించారు. ఇది కూడా కూటమిలో కాస్త అలజడి సృష్టించింది. పైగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ డీలా పడడాన్నీ ప్రస్తావించారు నితీశ్.


విభేదాలున్నా..


నితీశ్ కుమార్‌ని మీడియా చాలా సార్లు ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించింది. "మీరు ప్రధాని అభ్యర్థిగా ఉంటారా" అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు నితీశ్ కుమార్. పెద్దగా ఆసక్తి లేదన్న సంకేతాలిచ్చారు. అయితే..కూటమిలో మాత్రం తనను తాను ప్రధాని అభ్యర్థిగా చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే JDU నేతలు కొందరు నితీశ్ కుమార్‌ ప్రధాని రేసులో ఉన్నారంటూ ప్రచారం చేశారు. ప్రధానికి కావాల్సిన అన్ని అర్హతలూ నితీశ్‌కి ఉన్నాయని తేల్చి చెప్పారు. కొన్ని విభేదాలున్నప్పటికీ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశమైతే లేదని అంటున్నారు. ఎన్‌డీఏని ఢీకొట్టేందుకు ఇదో మంచి అవకాశమని, దీన్ని వదులుకోవాలని లేదని అంటోంది ఆ పార్టీ. 


2024 జనవరి మొదటి వారంలో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలను ఖరారు చేయనున్నట్లు ఏఐసీసీ  మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎంపీలు ప్రజాస్వామ్యబద్దంగా నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.  తొలుత తాము గెలిచి మెజార్టీ సాధించాలని.. ఆ తర్వాతే ఎంపీలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.  


Also Read: న్యూజెర్సీలో భారతీయ యువతి అదృశ్యం, నాలుగేళ్లైనా దొరకని ఆచూకీ - FBI కీలక ప్రకటన