Praja Bhavan Rash Driving Case: గతేడాది డిసెంబరులో హైదరాబాద్ లోని ప్రజాభవన్‌ ముందు జరిగిన ర్యాష్ డ్రైవింగ్ లో కీలక మలుపు జరిగింది. ఈ కేసులో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ పేరును కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో జోడించారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అర్ధరాత్రి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజా భవన్ ఎదుట బారీకేడ్లను ఢీకొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే రహీల్‌ దుబాయ్‌ పారిపోయేందుకు 10 మంది సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.


రహీల్‌కు సాయం చేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అర్బాజ్‌, సోహెల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. మరో ముగ్గురు పారిపోయినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. ఇప్పటికే రహీల్‌పై పోలీసులు ఎల్‌వోసీ జారీ చేశారు. దుబాయ్ లోఉన్న రహీల్ ను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.



బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈ ఘటన రెండు రోజులు ఆలస్యంగా వెలుగుచూసింది. డిసెంబరు 23న అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో అత్యంత వేగంతో ఓ బీఎండబ్ల్యూ కారు (TS 13 ET 0777) ప్రజాభవన్‌ ఎదుట ట్రాఫిక్‌ నియంత్రణ కోసం అడ్డుగా ఉంచిన బారికేడ్లను ఢీకొట్టి ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా, వాహన వేగానికి కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది.


ఈ బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో షకీల్  కుమారుడి పేరును కూడా చేర్చారు. ఈ విషయాన్ని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తనయుడ్ని తప్పించారని ప్రచారం ఉన్నందున స్వయంగా డీసీపీ దీనిపై వివరణ ఇచ్చారు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహిల్ అని డీసీపీ చెప్పారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. మిగతా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. గతంలో కూడా ఓ ప్రాంతంలో కారుతో విధ్వంసం సృష్టించి రాహిల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు.


ప్రజా భవన్ ఎదురుగా రోడ్డుపై న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్స్ ఉన్నాయని, వాటిని అతి వేగంగా వచ్చి అతను కారుతో ఢీకొన్నాడని వివరించారు. ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని చెప్పారు. వీళ్లంతా కాలేజీ స్టూడెంట్స్ అని చెప్పారు. 


అయితే, ఈ కేసు నమోదు సమయంలో అసలు నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యేను మరొకరి పేరును చేర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. కానీ, ప్రమాద సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారని చెప్పారు. మరో యువకుడిని పట్టుకున్నారు. అతడిని పరీక్షించి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి.. మద్యం తాగలేదని గుర్తించారు. అయితే, మాజీ ఎమ్మెల్యే ఆదేశంతో తన కుమారుడి ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే కారును డ్రైవ్ చేసినట్లుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు.