Girl Dies After Eating Cake: పంజాబ్‌లో ఓ పదేళ్ల బాలిక బర్త్‌డే కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా మృతి చెందింది. ఇంట్లో వాళ్లందరూ ఈ కేక్ తిన్న తరవాత అనారోగ్యానికి గురయ్యారు. ఆన్‌లైన్‌లో ఓ బేకరీ నుంచి కేక్ ఆర్డర్ చేసినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. పదేళ్ల మాన్వి పుట్టిన రోజు వేడుకల్ని చాలా సంతోషంగా చేసుకున్నారంతా. ఆ తరవాత కొద్ది గంటల్లోనే ఈ విషాదం జరిగింది. పుట్టిన రోజు తెల్లారే బాలిక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన మిగిల్చింది. మార్చి 24వ తేదీన సాయంత్రం 7 గంటలకు కేక్ కట్టింగ్ జరిగింది. 10 గంటల సమయంలో అందరూ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. మాన్వి నీళ్లు కావాలని అడిగినట్టు ఆమె తాతయ్య చెప్పారు. గొంతు ఎండిపోతోందని పదేపదే నీళ్లు తాగినట్టు వివరించారు. ఆ తరవాత నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఆమె ఆరోగ్యం మరీ ఆందోళనకరంగా మారడం వల్ల వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఊపిరి తీసుకోడానికీ ఇబ్బంది పడింది. వెంటనే ఆక్సిజన్ అందించారు. ఆ తరవాత ECG టెస్ట్ చేశారు. ఆమెని కాపాడేందుకు చాలా సేపు ప్రయత్నించారు. కానీ కాసేపటికే బాలిక కన్నుమూసింది. ఈ కేక్‌ పంపిన బేకరీపై కుటుంబ సభ్యులు మండి పడుతున్నారు. వాళ్ల వల్లే బాలిక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. బేకరీ ఓనర్‌పై పోలీసులు FIR నమోదు చేశారు. ఆ కేక్ శాంపిల్‌ని టెస్టింగ్‌ పంపారు.