AAP MLA Baljinder Kaur: 


సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ 


ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే బలిజేందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యేపై ఇలా చేయి చేసుకోవటంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళలను ఇంత చులకనగా చూసే తీరు మారదా అంటూ మండి పడుతున్నారు. ఈ వీడియోలో ఆమె చుట్టూ కొందరు పురుషులు ఉన్నారు. ఏదో వాగ్వాదం జరుగుతున్నట్టు అర్థమవుతోంది. అప్పటి వరకూ ఎదురుగా కూర్చుని ఉన్న ఆమె భర్త..ఉన్నట్టుండి లేచి బలిజేందర్ కౌర్‌ను చెంప దెబ్బ కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్లు వెంటనే ఆయనను పక్కకు లాగారు. పంజాబ్ స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ సంస్థ ఛైర్ పర్సన్‌ మనీషా గులాటి ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించారు. "బలిజేందర్ కౌర్‌కు సంబంధించిన వీడియోను నేను సోషల్ మీడియాలో చూశాను. దీన్ని సుమోటోగా స్వీకరిస్తాం. ప్రజా సమస్యల్ని పరిష్కరించే ఎమ్మెల్యేలు...ఇంట్లో ఇలా వేధింపులకు గురి కావటం ఎంతో బాధాకరం" అని మనీషా అసహనం వ్యక్తం చేశారు. జులై 10న ఈ ఘటన జరగ్గా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆమెపై చేయి చేసుకోవడం షాకింగ్‌గా ఉందని, ఇకనైనా మగవాళ్ల ఆలోచనా తీరు మారాలని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై బల్జిందర్‌ కౌర్‌ మాత్రం స్పందించలేదు. పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. 


ఇటీవల విడుదలైన NCRB రిపోర్ట్ ప్రకారం...పంజాబ్‌లో మహిళల పట్ల 17% మేర నేరాలు పెరిగాయని తేలింది. 2020లో 4,838 కేసులు నమోదు కాగా 2021లో 5,662 కేసులు వెలుగులోకి వచ్చాయి. 2021లో పంజాబ్‌లోనే 508 అత్యాచార కేసులు నమోదయ్యాయి.